Dhulipala Narendra Kumar: సంఘటన స్థలంలో నేను లేకపోయినా ముద్దాయిగా నా పేరు చేర్చారు: ధూళిపాళ్ల

  • ఇటీవల సంగం డెయిరీ వద్ద ఘర్షణలు
  • టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రపై హత్యాయత్నం కేసు
  • ముందస్తు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం
  • డెయిరీ ఎదుట గొడవ చేసింది కిరాయి మనుషులేనన్న ధూళిపాళ్ల
  • సంగం డెయిరీపై ప్రభుత్వం కుట్రకు తెరదీసిందని ఆరోపణ
Dhulipalla talks about Sangam Dairy issues

ఇటీవల సంగం డెయిరీ ఎదుట ఘర్షణలు జరగ్గా, ఆ వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై హత్యాయత్నం కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసులో ధూళిపాళ్ల నరేంద్రకు న్యాయస్థానం నిన్న ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ధూళిపాళ్ల స్పందించారు. 

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సంగం డెయిరీ ఎప్పుడూ కూడా వ్యక్తులతో ఒప్పందాలు చేసుకోదని స్పష్టం చేశారు. సంగం డెయిరీ పాల ధరలు వ్యక్తులు ఇష్టానుసారం నిర్ణయించేందుకు వీలుండదని అన్నారు. సంగం డెయిరీపై ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారం చేస్తున్నారని ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇటీవల కిరాయి మనుషులతో డెయిరీ ముందు గొడవ చేయించారని ఆయన ఆరోపించారు. విధ్వంసం చేయడానికి వచ్చిన వారిపై కాకుండా తమపై కేసులు పెట్టారని వెల్లడించారు. ప్రభుత్వం సంగం డెయిరీపై కుట్రకు తెరదీసిందన్న విషయం దీంతో స్పష్టమైందని వివరించారు. 

పోలీసులు ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని ధూళిపాళ్ల విమర్శించారు. సంఘటన స్థలంలో తాను లేకపోయినా ముద్దాయిగా చేర్చారని, ఎమ్మెల్యే కిలారు రోశయ్య ఐజీని కలిసి కేసులో తన పేరును కూడా చేర్పించారని ఆరోపించారు.

More Telugu News