Dog Empathy: కొడుకును కోల్పోయిన తల్లిని ఓదార్చుతున్న శునకం!

  • బైక్ కు అడ్డం వెళ్లిన కుక్క.. అదుపు తప్పి కిందపడ్డ యువకుడు
  • తలకు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి
  • డెడ్ బాడీతో పాటు ఇంటికి వచ్చిన శునకం
Empathy bring dog to dead mans mom

విశ్వాసానికి మారుపేరుగా అందరికీ గుర్తొచ్చే పేరు ‘కుక్క’.. ఓ ముద్ద పెడితే తోకూపుకుంటూ వెనకే తిరిగే శునకం తన యజమానిని కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. యజమాని సడెన్ గా చనిపోతే తిండీతిప్పలు మానేసి సమాధి వద్దే కన్నుమూసిన శునకం గురించిన వార్తలు తరచుగా చూస్తుంటాం.. అయితే, తన కారణంగా ఓ యువకుడు చనిపోయాడనే కారణంతో ఓ శునకం నిశ్శబ్దంగా రోదిస్తోంది. మృతుడి తల్లితో కలిసి ఆ బాధను పంచుకుంటోంది. కర్ణాటకలోని దావణగెరెలో ఈ ఘటన చోటుచేసుకుంది.

దావణగెరెకు చెందిన తిప్పేష్ అనే యువకుడు ఇటీవల తన సోదరిని బస్టాప్ లో దించేందుకు బైక్ పై తీసుకెళ్లాడు. ఆపై ఇంటికి తిరిగొస్తుండగా ఓ వీధిలో నుంచి సడెన్ గా కుక్క పరిగెత్తుకు వచ్చింది. కుక్కను గమనించిన తిప్పేష్ సడెన్ బ్రేక్ వేశాడు. బైక్ అదుపుతప్పి కిందపడడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తిప్పేష్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత ఆ శునకం చేసిన పని చూపరులను కంటతడి పెట్టిస్తోంది. తిప్పేష్ మృతదేహంతో పాటే ఇంటిదాకా వెళ్లిన శునకం.. ఆ తర్వాత కూడా అక్కడక్కడే తిరిగింది.

ఆ వీధిలోని ఇతర కుక్కలు తరమడంతో దూరంగా వెళ్లినట్లే వెళ్లి మళ్లీ వచ్చింది. రెండు మూడు రోజుల పాటు ఈ తంతు కొనసాగింది. ఆ తర్వాత తిప్పేష్ ఇంట్లోకి ప్రవేశించి, తిప్పేష్ తల్లి పక్కనే కూర్చుని మూగగా రోదించింది. తిప్పేష్ తల్లితో పాటే తిరుగుతూ ఇంట్లోనే ఉండిపోయింది. ఈ కుక్క ప్రవర్తన తిప్పేష్ ఇంట్లో వాళ్లతో పాటు చుట్టుపక్కల వారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడు ఆ శునకాన్ని తమ కుటుంబ సభ్యుడిలాగానే చూస్తున్నట్లు తిప్పేష్ తల్లి, సోదరి చెబుతున్నారు.

More Telugu News