Amit Shah: కేసీఆర్ రజాకార్లకు భయపడి విమోచన దినం జరపడం లేదు: అమిత్ షా

  • కేసీఆర్ పదేళ్ల కాలంలో ప్రజల కోసం ఏమీ చేయలేదని, కేటీఆర్ కోసం వేలకోట్ల అవినీతి చేశారని ఆరోపణ
  • బీజేపీ పసుపు బోర్డు ఇచ్చిందని గుర్తు చేసిన కేంద్రమంత్రి
  • అధికారంలోకి రాగానే విమోచన దినం జరుపుతామని హామీ
  • కేసీఆర్ దళిత సీఎం హామీని విస్మరించారని, బీజేపీ మాత్రం బీసీని సీఎం చేస్తుందని వ్యాఖ్య
  • డబ్బులు ఎవరు ఎక్కువగా ఇస్తే వారికే మంత్రి పదవులు ఇస్తారని ఆరోపణ
Amit Shah public meeting in Armur

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పదేళ్ల కాలంలో ప్రజల కోసం ఏ పనీ చేయలేదని, కానీ తన కొడుకు కేటీఆర్ కోసం వేలాది కోట్ల రూపాయల అవినీతి మాత్రం చేశారని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆర్మూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ ఒక్క హామీని నెరవేర్చలేదని, కానీ బీజేపీ ఇక్కడి ప్రజల కోసం పసుపు బోర్డు ఇచ్చిందని గుర్తు చేశారు. బీడీ వర్కర్ల కోసం ప్రత్యేక హాస్పిటల్, ఉత్తర తెలంగాణ నుంచి వెళ్లిన గల్ఫ్ బాధితుల కోసం ఎన్ఆర్ఐ పాలసీని తెచ్చామన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే అధికారికంగా హైదరాబాద్ విమోచన దినం జరుపుతామని పునరుద్ఘాటించారు. ఓవైసీకి, రజాకార్లకు భయపడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినం జరపడం లేదన్నారు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి కేసీఆర్ మాట తప్పారని, కానీ బీజేపీ బీసీని ముఖ్యమంత్రిగా చేసి మాట నిలబెట్టుకుంటుందన్నారు.

జీఎస్టీలో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకు వస్తున్నామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. డబ్బులు ఎక్కువగా ఎవరు ఇస్తే కేసీఆర్ మంత్రి వర్గంలో వారే ఉంటారని ఆరోపించారు. అవినీతి కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన అవసరం ఉందన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించి, పేపర్ లీకేజీ ఘటనపై విచారణ చేసి జైలుకు పంపిస్తామన్నారు. కేసీఆర్ కారు స్టీరింగ్ అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఉందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌తో సుపరిపాలన సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్‌లో కేవలం మంత్రి పదవి పొందాలంటే ఢిల్లీలో చర్చించాలి అని.. అలాంటి పార్టీ అవసరమా? అని ప్రశ్నించారు.

More Telugu News