Mamata Banerjee: ఇండియా అన్ని మ్యాచ్ లలో గెలిచింది.. ఫైనల్ కు పాపులు వెళ్లి ఓడించారు: మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

  • ముంబై లేదా కోల్ కతాలో ఫైనల్స్ జరిగి ఉంటే ఇండియా గెలిచేదన్న మమత
  • ఫైనల్స్ కు పాపులు వచ్చారంటూ మోదీపై విమర్శలు
  • ఆటగాళ్ల జెర్సీలను కాషాయం రంగులో తయారు చేశారని మండిపాటు
Mamata Banerjee says sinners at stadium defeated India

వరల్డ్ కప్ ఫైనల్స్ లో టీమిండియా ఓడిపోవడంపై రాజకీయ నేతలు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఫైనల్స్ అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో కాకుండా లక్నోలో పెట్టి ఉంటే ఇండియా గెలిచేదని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. తాగాజా ఇదే అంశంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు. 

వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ లో ఇండియా గెలిచిందని... కానీ, ఫైనల్స్ కు పాపులు (పరోక్షంగా మోదీ) వచ్చారని... ఫైనల్స్ ఓడిపోవడానికి ఆ పాపులు మ్యాచ్ కు రావడమే కారణమని మమత విమర్శించారు. అహ్మదాబాద్ లో కాకుండా ముంబైలోని వాంఖడేలో కానీ, కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కానీ మ్యాచ్ ను నిర్వహించి ఉంటే ఇండియా కప్ ను సాధించేదని చెప్పారు. 

దేశాన్ని కాషాయమయం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మమత విమర్శించారు. టీమిండియా ప్రాక్టీస్ చేసే సమయంలో ధరించే జెర్సీలను కూడా కాషాయ రంగులో తయారు చేశారని... తద్వారా టీమ్ ను కూడా కాషాయీకరించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 

More Telugu News