Puvvada Ajay Kumar: తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంను ఎందుకు అభివృద్ధి చేయలేదు?: పువ్వాడ అజయ్

  • బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్న పువ్వాడ
  • అత్యధిక నిధులు తెచ్చి నిర్విరామంగా పని చేయడం వల్ల ప్రగతి సాధ్యమైందని వెల్లడి
  • ఇంతకుముందు మంత్రులెవరూ ఇలా సైకిళ్లపై తిరిగి పనులు చేయలేదన్న పువ్వాడ  
Puvvada Ajay quesions tummala nageswara rao over khammam development

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారని, ఆ తర్వాత ఎమ్మెల్యేగా పని చేశారని కానీ ఖమ్మంను ఎందుకు అభివృద్ధి చేయలేదో చెప్పాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రశ్నించారు. ఖమ్మంలో ఆయన గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఖమ్మం ప్రజలంతా అభివృద్ధి వెంటే ఉన్నారని, కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. తాను ఇక్కడి వాడినే.. ఇక్కడి ప్రజల కష్టాలు తెలిసిన వాడినే.. కాబట్టే ఖమ్మంను అద్భుతంగా తీర్చిదిద్దానని చెప్పారు. ప్రజల కష్టాలకు పరిష్కారం చూపానని వెల్లడించారు. ఖమ్మం ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. తద్వారా అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిపినట్లు తెలిపారు.

ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు తెచ్చి నిర్విరామంగా పని చేయడం వల్ల ఇంతటి ప్రగతి సాధ్యమైందని తెలిపారు. మంత్రిగా ఉండి అధికారులను వెంట బెట్టుకొని నగరంలోని ప్రతి వీధినీ పరిశీలించినట్లు తెలిపారు. ఇంతకుముందు మంత్రులెవరూ ఇలా సైకిళ్లపై తిరిగి పనులు చేయలేదని గుర్తుచేశారు. ఇన్ని దశాబ్దాలుగా తుమ్మల ఖమ్మంను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో మొదటి బ్యాలెట్‌లో మొదటి సంఖ్యలో ఉన్న కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News