Taj Hotels: తాజ్ హోటల్స్ కంప్యూటర్లపై హ్యాకర్ల దాడి... ప్రమాదంలో 15 లక్షల మందికి చెందిన కీలక సమాచారం 

  • డీఎన్ఏ కుకీస్ హ్యాకర్ల బృందం దాడికి పాల్పడినట్టు వార్తలు
  • రూ.4.16 లక్షలకు అమ్మకానికి డేటా
  • చోరీకి గురైన డేటా ఏమంత ముఖ్యమైనది కాదంటున్న తాజ్ హోటల్స్ వర్గాలు
Taj Hotels data breached

ప్రఖ్యాత తాజ్ హోటల్స్ కంప్యూటర్ వ్యవస్థపై హ్యాకర్లు దాడి చేశారు. దాదాపు 15 లక్షల మంది కస్టమర్లకు చెందిన కీలక సమాచారాన్ని హస్తగతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ డేటా చౌర్యానికి పాల్పడింది డీఎన్ఏ కుకీస్ అనే హ్యాకర్ల బృందంగా భావిస్తున్నారు. రూ.4.16 లక్షలకు తాజ్ హోటల్స్ కస్టమర్ల డేటాను ఆ హ్యాకర్లు అమ్మకానికి పెట్టినట్టు వెల్లడైంది. 

హ్యాకర్ల పాలైన సమాచారంలో చిరునామాలు, సభ్యత్వ ఐడీలు, మొబైల్ ఫోన్ నెంబర్లు, ఇతర వ్యక్తిగత వివరాలు ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజ్ గ్రూప్ హోటళ్లను నిర్వహిస్తున్న ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ సీఎల్) ప్రతినిధి దీనిపై స్పందించారు. కొంత మేర తమ కస్టమర్ల సమాచారం చోరీకి గురైందని వెల్లడించారు. చోరీకి గురైన డేటా ఏమంత ముఖ్యమైనది కాదని పేర్కొన్నారు. ఏదేమైనా కస్టమర్ల భద్రత తమకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. 

డేటా చౌర్యంపై సంబంధిత అధికారులకు నివేదించామని వెల్లడించారు. తమ కంప్యూటర్ వ్యవస్థలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇది తమ వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం చూపిస్తుందని అనుకోవడంలేదని పేర్కొన్నారు.

More Telugu News