రూ.100 కోట్ల పోంజి స్కీమ్ కేసులో ప్రకాశ్ రాజ్ కు ఈడీ నోటీసులు

  • వివాదంలో చిక్కుకున్న ప్రకాశ్ రాజ్
  • ఓ స్కీమ్ లో రూ.100 కోట్లు వసూలు చేసిన ప్రణవ్ జ్యుయెలర్స్
  • ఆపై దుకాణం మూసివేత 
  • ప్రణవ్ జ్యుయెలెర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన ప్రకాశ్ రాజ్
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. రూ.100 కోట్ల పోంజి స్కీమ్ కేసుకు సంబంధించి ప్రకాశ్ రాజ్ కు ఈడీ నోటీసులు పంపింది. తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 

అసలేం జరిగిందంటే... తమిళనాడుకు చెందిన ప్రణవ్ జ్యుయెలర్స్ కు ప్రకాశ్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. అయితే ఈ సంస్థ ప్రజలకు అధిక లాభాల ఆశచూపి రూ.100 కోట్ల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. గతేడాది అక్టోబరులో ప్రణవ్ జ్యుయెలర్స్ కార్యకలాపాలు నిలిపివేసింది. దాంతో డబ్బు కట్టిన వారు లబోదిబోమన్నారు. 

అనేక ఫిర్యాదులు అందడంతో ఈ సంస్థ యజమాని మదన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసు కూడా జారీ చేశారు. ఆర్థిక అంశాలకు చెందిన కేసు కావడంతో ఈడీ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రకాశ్ రాజ్ ను ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించింది.


More Telugu News

Prakash Raj Notice ED Scheme