Pawan Kalyan: ఎరుపు జెండా విప్లవానికి... కాషాయం సనాతన ధర్మానికి గుర్తు: సూర్యాపేట సభలో పవన్ కల్యాణ్

  • జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన జనసేనాని
  • తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్న పవన్ కల్యాణ్
  • అన్ని రంగాల్లో వెనుకబడిన తెలంగాణలో ధర్మయుద్ధం చేద్దామన్న పవన్ కల్యాణ్
Pawan Kalyan talks about Double

తెలంగాణలో బీజేపీ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తన చేతిలోని ఎరుపు కండువాను చూపించి ఇది విప్లవానికి గుర్తు అని, కాషాయం జెండా సనాతన ధర్మానికి గుర్తు అని వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో ఈ రెండు రంగులు కలిసి ముందుకు సాగుతున్నాయని, కుల, మతాలకు అతీతంగా కేంద్రం ముందుకు సాగుతోందని, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్‌తో ముందుకు సాగుతోందన్నారు. గురువారం సూర్యాపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. 

జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన పవన్ మాట్లాడుతూ... అన్నిరంగాల్లో వెనుకబడిన తెలంగాణలో ధర్మయుద్ధం చేద్దామన్నారు. నిధులు, నియామకాలు, నీళ్ల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావానికి నల్గొండ కారణమైందన్నారు. తాను నటించిన తమ్ముడు సినిమా వందరోజుల పండుగకు ఇక్కడకు వచ్చానని, ఫ్లోరోసిస్ వ్యాధి సమస్యలను గమనించానని, అదే తన రాజకీయ ఆవిర్భావానికి స్ఫూర్తినిచ్చిందన్నారు. తెలంగాణలో బీసీలు రాజ్యాధికారం దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు.

నరేంద్రమోదీ నాయకత్వంలో దేశంలో అందరికీ సమానత్వం అనే నినాదంతో పాలన సాగుతోందన్నారు. జనసేన మనస్ఫూర్తిగా బీజేపీకి మద్దతిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఆడపడుచులు ఎక్కువగా అదృశ్యమవుతున్నారని, మహిళలపై ఆగడాలు ఎక్కువయ్యాయన్నారు. సుపరిపాలన కోసం తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా జనసేన కృషి చేస్తోందన్నారు. తెలంగాణ యువత పోరాట స్ఫూర్తితో ఆంధ్రాలో పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. జన్మనిచ్చిన తెలంగాణకు సేవ చేయాలనే వచ్చానని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

More Telugu News