Bharath Ratna: తనకు ‘భారత రత్న’ ఇవ్వాలంటూ యూపీ వ్యక్తి లేఖ.. ఎందుకంటే..!

  • దేశ అత్యున్నత అవార్డుకు అర్హుడినంటూ తన మనస్సు చెబుతోందని కామెంట్
  • చెత్తబుట్టలో పడేయాల్సిన లేఖను వెరిఫికేషన్ కోసం పంపిన ఉన్నతాధికారులు
  • క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత రిజెక్ట్ చేసిన అధికారులు
This UP man wants Bharat Ratna for himself

ఉత్తరప్రదేశ్ లో భారత రత్న అవార్డుకు అర్హుడినంటూ ఓ వ్యక్తి రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉన్నతాధికారులకు ఇలాంటి లేఖలు రావడం కొత్తేం కాదు.. ఇలాంటి వాటిని వారు వెంటనే చెత్తబుట్టలో వేస్తుంటారు. అయితే, తాజా లేఖను అందుకున్న డివిజనల్ కమిషనర్ దానిని పరిశీలన కోసం కలెక్టర్ కు పంపడమే ఆశ్చర్యానికి కారణం. సదరు కలెక్టర్ కూడా ఈ లెటర్ ను జాగ్రత్తగా కిందిస్థాయి సిబ్బందికి పంపించడం మరో వింత. చివరకు ఆ లేఖ రాసిన గ్రామానికి చెందిన అధికారుల దాకా చేరింది. వారు దానిని రిజెక్ట్ చేస్తూ తిరిగి పంపించారు.

గోరఖ్ పూర్ జిల్లా మహ్రాజీ గ్రామానికి చెందిన వినోద్ కుమార్ గౌర్ ఈ లేఖ రాశాడు. దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ అందుకోవడానికి అన్ని అర్హతలు తనకున్నాయంటూ తన మనస్సు చెబుతోందని, ఆ అవార్డుకు తన పేరును పరిశీలించాలని అందులో కోరాడు. ఈ లేఖను అందుకున్న డివిజనల్ కమిషనర్ దీనిని గోరఖ్ పూర్ కలెక్టర్ కు పంపించి, పరిశీలించాలని పేర్కొన్నారు. కలెక్టర్ నుంచి తహసీల్ కు, అక్కడి నుంచి మహ్రాజీ గ్రామ అధికారులకు ఈ లేఖ చేరింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వినోద్ కుమార్ గౌర్ ఇంటికి వెళ్లిన పంచాయతీ సిబ్బంది.. ఆయన చేసిన ఘనకార్యమేంటని ఆరా తీశారు. ఆపై వినోద్ కుమార్ తన జీవితంలో ఎలాంటి గొప్ప పని చేయలేదని పేర్కొంటూ కలెక్టర్ కు నివేదిక పంపించారు. ఈ నివేదిక ఆధారంగా వినోద్ కుమార్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

More Telugu News