annamalai: శ్రీలంకలోనూ కుటుంబ పాలన కారణంగా దేశం నాశనమైంది: కేసీఆర్‌పై అన్నామలై తీవ్ర విమర్శలు

  • కేసీఆర్ పార్టీ కల్వకుంట్ల రాష్ట్రీయ సమితిగా మారిందని చురకలు
  • ఒక పార్టీ ఒక వ్యక్తి చుట్టూ తిరిగితే అది రాష్ట్రానికి మంచిది కాదన్న అన్నామలై
  • 8 కోట్ల జనాభా ఉన్న తమిళనాడు అప్పు రూ.7 లక్షల కోట్లుగా ఉందని వెల్లడి
  • కానీ 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ అప్పు రూ.6.5 లక్షల కోట్లుగా ఉందని విమర్శలు
Annamalai campaign in Sherilinkampalli

తెలంగాణలో కేసీఆర్ పార్టీ... కల్వకుంట్ల రాష్ట్రీయ సమితిగా మారిందని, ఓ పార్టీ ఒక వ్యక్తి చుట్టూ లేదా ఒక కుటుంబం చుట్టూ తిరిగితే అది రాష్ట్రానికి మంచిది కాదని, శ్రీలంకలోనూ కుటుంబ పాలన కారణంగా దేశం నాశనమైందని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణలోని శేరిలింగంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేసీఆర్ అవినీతితో రాజకీయాలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. విభజన తర్వాత కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ అమలు చేయలేదన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కేసీఆర్ ఆరున్నర లక్షల కోట్ల అప్పులు చేశారని ధ్వజమెత్తారు. ఎనిమిది కోట్ల జనాభా కలిగిన తమిళనాడుకు రూ.7 లక్షల కోట్ల అప్పు ఉంటే, 4 కోట్ల జనాభా కలిగిన తెలంగాణ రూ.6.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయిందని ఆరోపించారు.

దేశమంతా ఇప్పుడు నరేంద్రమోదీ మోడల్ కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వ పాలన అవినీతికి మోడల్‌గా మారిందని విమర్శించారు. బీజేపీ అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీ టీమ్ అయితే బీఆర్ఎస్‌కు మజ్లిస్ బీ టీమ్ అని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన రైతు ఇన్సూరెన్స్ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు? అని ప్రశ్నించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం మినీఇండియాగా ఉందని, ఇక్కడ అన్ని వర్గాలకు న్యాయం చేస్తాడనే ఉదేశ్యంతో పార్టీ అధిష్ఠానం రవికుమార్ యాదవ్‌కు టిక్కెట్ ఇచ్చిందన్నారు. ఆయనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News