Kanakamedala Ravindra Kumar: సజ్జల కోర్టు తీర్పును కూడా పక్కదారి పట్టిస్తున్నారు: కనకమేడల

  • స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్
  • స్కిల్ వ్యవహారంలో చంద్రబాబే సూత్రధారి అంటూ సజ్జల వ్యాఖ్యలు
  • కోర్టు తీర్పును కూడా వక్రీకరిస్తున్నారంటూ కనకమేడల ఆగ్రహం 
Kanakamedala take a jibe at Sajjala

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. సజ్జల వ్యాఖ్యలను టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ తప్పుబట్టారు.

సజ్జల కోర్టు తీర్పును కూడా పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఏపీ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ, వైసీపీ నేతలు దాన్ని కూడా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. మీడియా ముందుకొచ్చి సజ్జల మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు. సజ్జల వ్యాఖ్యలు చూస్తుంటే న్యాయస్థానాల పట్ల ఏమాత్రం గౌరవం లేదని అర్ధమవుతోందని కనకమేడల వ్యాఖ్యానించారు. స్కిల్ కేసులో చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు ఆధారాల్లేవని కోర్టు చెప్పినప్పటికీ, షెల్ కంపెనీలకు డబ్బు వెళ్లిందని సజ్జల అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆఖరికి టీడీపీకి సభ్యత్వాల రూపంలో వచ్చిన విరాళాలను కూడా ఈ కేసుతో ముడిపెట్టడం దారుణమని వ్యాఖ్యానించారు. కేవలం కక్షసాధింపుతోనే చంద్రబాబును కేసులో ఇరికించారని కనకమేడల విమర్శించారు.

More Telugu News