Payyavula Keshav: నరకాసుర వధ ప్రారంభమైంది... అందుకే ఈ సంబరాలు: సజ్జల వ్యాఖ్యలకు పయ్యావుల కౌంటర్

  • చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్
  • మీడియా సమావేశంలో విమర్శలు చేసిన సజ్జల
  • సజ్జల నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్న పయ్యావుల
  • ఆధారాలు చూపించలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా
Payyavula counters Sajjala remarks on Chandrababu bail

చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ నేడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సీఐడీకి, వైసీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు తప్పుచేశాడని పదే పదే మీడియా ముందు చౌకబారు ఆరోపణలు చేసేవారికి చెంపపెట్టు అంటూ టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు బెయిల్ లభించిన అనంతరం ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. పయ్యావుల తన నివాసం నుంచి జూమ్ ద్వారా మాట్లాడారు.

చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికే సజ్జల నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సజ్జల చెప్పినట్టు మేం దీపావళి సంబరాలు చేసుకోవడం లేదు... నరకాసుర వధ ప్రారంభం కాబోతుందని సంబరాలు చేసుకోబోతున్నాం అని స్పష్టం చేశారు. 

"ఆధారాలు మా వద్ద ఉన్నాయి... అవి కోర్టు ముందు పెట్టడం మరిచిపోయామని సజ్జల చెబుతాడా? సునీత రాసిన నోట్... దానికి సంబంధించిన ఫైల్ దొరకలేదని సజ్జల చెప్పడం పచ్చి అబద్ధం. ఫైల్ ప్రభుత్వం వద్దే ఉంది. కేవలం చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికే ఇప్పటికీ ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతమంది సాక్షుల్ని విచారించినా, ఇన్నివేల డాక్యుమెంట్స్ మీరు సేకరించినా, ప్రాథమికంగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు నష్టం జరిగిందని చెప్పే ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు... నిర్ధారించలేకపోయారు అని కోర్టు చాలా స్పష్టంగా తీర్పులో అభిప్రాయపడింది” అని పయ్యావుల పేర్కొన్నారు.


సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం అవమానంతో తలదించుకోవాలి!

చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలపై ఏమాత్రం సిగ్గున్నా సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం అవమానంతో తలదించుకోవాలి. కళ్లకు ఏది కనిపిస్తే అది... ఊహకు ఏమి తోస్తే దాన్ని కేసులో పేర్కొంటారా? ఈ ప్రభుత్వం, సీఐడీ విభాగం స్కిల్ కేసులో తొలినుంచీ చెబుతున్న అన్ని అంశాలను న్యాయస్థానం ఆధారాలు లేనివిగా కొట్టిపారేసింది. 

ఇన్ కైండ్ గ్రాంట్ ప్రస్తావనే లేదు!

స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన ఫోరెన్సిక్ ఆడిట్ ఎవరో ఒకవ్యక్తికి ఇచ్చాము... దానిలో ఏవో తప్పులు కనిపించాయని జగన్ రెడ్డి సర్కార్ , సీఐడీ ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చాయి. దానిపైనా న్యాయస్థానం స్పందించింది. ‘Is Not Agreed Upon’, ‘Cannot be Relied Upon’ అనే భావం వచ్చేలా న్యాయస్థానం స్పష్టంగా అభిప్రాయపడింది. అలానే ఈ కేసులో ఎక్కడా డబ్బు ఇచ్చినట్టు, మనీ ట్రయల్ జరిగినట్టు కూడా ఆధారాలు లేవని చెప్పింది. తప్పు అని ఈ ప్రభుత్వం  చెప్పిన ‘ఇన్ కైండ్ గ్రాంట్’ ప్రస్తావన కూడా ఎక్కడా న్యాయస్థానం చేయలేదు. 

మేం మొదట్నించి చెబుతున్నదే నిజమైంది

ఒక విధానాన్ని ఏ రకంగా తప్పుగా చూపి... అనేక తప్పులు చేసే ప్రయత్నం చేశారో, అవి ఏవీ కూడా న్యాయస్థానాన్ని నమ్మించలేకపోయాయి. మేం తొలినుంచీ... ఎక్కడా ఎలాంటి తప్పు జరగలేదు... రూపాయి పక్కకు పోలేదు... ఎలాంటి ఆధారాల్లేవు... అక్రమంగా తప్పుడు కేసు పెట్టారు... అని చెప్పామో, అవే వాదనల్ని కోర్టు దాదాపుగా అంగీకరించింది. ఇప్పుడు కేవలం బెయిల్ పిటిషన్ పై మాత్రమే హైకోర్టు తీర్పు ఇచ్చింది.. ఫైనల్ జడ్జిమెంట్ కాదు. కానీ ఇప్పటికే న్యాయస్థానం చేసిన కామెంట్స్ చూస్తే... ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంగా తేల్చింది" అని పయ్యావుల వివరించారు.

More Telugu News