Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుకు ఇచ్చింది బెయిల్ మాత్రమే: సజ్జల

  • స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్
  • ఈ కేసులో చంద్రబాబే సూత్రధారి అన్న సజ్జల
  • చంద్రబాబు నుంచే కుంభకోణం ఆలోచన మొదలైందని వెల్లడి
Sajjala talks about Chandrababu bail

స్కిల్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు లేవంటూ ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 

స్కిల్ కేసులో చంద్రబాబే సూత్రధారి అని స్పష్టం చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా చంద్రబాబును 37వ నిందితుడిగా చేర్చారని వెల్లడించారు. ఆయన నుంచే ఈ కుంభకోణం ఆలోచన మొదలైందని, తన ఆమోదంతోనే స్కిల్ వ్యవహారంలో నియామకం జరిగిందని, తన ఆమోదంతోనే నిధులు విడుదల అయ్యాయని ఆరోపించారు. తాను చెప్పి, ఒత్తిడి తీసుకువచ్చి బ్యాంకు గ్యారెంటీల నుంచి సదరు కంపెనీలకు మినహాయింపులు ఇచ్చేలా చేశాడని తెలిపారు. 

ఇన్ని చేసిన చంద్రబాబు ఏ1 కాక మరెవరు? అని సజ్జల ప్రశ్నించారు. ఈ కేసులో మిగతా వారందరికీ బెయిల్ ఇచ్చారని... చంద్రబాబుకు కూడా బెయిల్ ఇవ్వాలంటున్నారు... ఇది కూడా ఒక వాదనేనా అని విమర్శించారు.

"రాజకీయంగా చంద్రబాబు ఎంతగా బయట తిరిగితే అంత మంచిది. ఆయనలోని డొల్లతనం అందరికీ కనిపిస్తుంది. చంద్రబాబులోని మోసగాడు ప్రత్యక్షంగా కళ్ల ముందు కనిపిస్తుంటాడు. ఎన్నికలు కూడా దగ్గరికి వచ్చాయి కాబట్టి జనాలు కూడా నిలదీస్తుంటారు. చంద్రబాబు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారనేందుకు నిదర్శనం ఉంది. ఆయన ఇప్పటికే ఒకరిని దేశం దాటించారు. ఈ కేసు నిలబడేందుకు అవసరమైన చర్యలన్నీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చూసుకుంటారు. అంతవరకు ఎవరూ అపోహలకు గురికావద్దు... తప్పుదారిలో వెళ్లొద్దు. ఇచ్చింది కేవలం బెయిల్ మాత్రమేనని అందరూ గుర్తించాలి" అని స్పష్టం చేశారు.

More Telugu News