Shirdi Tour: విమానంలో షిర్డీ చుట్టి రావాలనుకుంటున్నారా?.. ఈ ప్యాకేజీ ట్రై చేయండి

  • ప్యాకేజీ ప్రారంభించిన తెలంగాణ పర్యాటక అభివృద్ది సంస్థ
  • ప్యాకేజీ ధర రూ. 12,499 మాత్రమే
  • హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1.30 విమానంలో షిర్డీకి
  • భోజనం, హోటల్ బస వంటివి ప్యాకేజీలోనే
Telangana State Tourism Development Corporation Offers Shirdi Air Tour

హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఇది శుభవార్తే. అతి తక్కువ ఖర్చుతో విమానంలో షిర్డీ చుట్టేసి రావొచ్చు. ఈ అద్భుత అవకాశాన్ని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ ధర ఒకరికి రూ. 12,499 మాత్రమే. భోజనం, హోటల్‌లో బస వంటివి ఇందులో కవరవుతాయి. కొన్ని దర్శన టికెట్లను మాత్రం ఇందులో కవర్ కావు.  

ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు విమానం బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు షిర్డీలో ల్యాండ్ అవుతుంది. ఆ తర్వాత హోటల్‌కు చేరుకుని విశ్రాంతి తర్వాత సాయంత్రం 4.30 గంటలకు షిర్డీసాయి దర్శనం ఉంటుంది. హారతి కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. రాత్రి 7 గంటలకు బాబా థీమ్ పార్కులో సౌండ్ అండ్ లౌట్ షో చూడొచ్చు. తిరిగి రాత్రి హోటల్‌లో బస. 

రెండోరోజు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత 8 గంటలకు పంచముఖి గణపతి ఆలయ సందర్శన ఉంటుంది. అనంతరం పాత షిర్డీ, ఖండోబా మందిరం, సాయితీర్థం వంటి ప్రదేశాలను సందర్శించాల్సి ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత 3 గంటలకు విమానం బయలుదేరి గంట ప్రయాణం తర్వాత సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ విమాశ్రయం చేరుకోవడంతో ప్రయాణం ముగుస్తుంది.

More Telugu News