S Venkitaramanan: ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వెంకట రమణన్‌ కన్నుమూత

  • అనారోగ్యంతో కన్నుమూసిన వెంకటరమణన్
  • చెన్నైలో తుదిశ్వాస విడిచిన ఆర్బీఐ మాజీ గవర్నర్
  • గతంలో ఉన్నత స్థాయిలో సేవలు అందించిన వెంకటరమణన్
RBI former governor Venkitaramanan passed away

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త ఎస్.వెంకటరమణన్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన ఈ ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. వెంకటరమణన్ వయసు 92 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

ఎస్.వెంకటరమణన్ 1931లో తమిళనాడులోని నాగర్ కోయిల్ లో జన్మించారు. ఆర్బీఐ 18వ గవర్నర్ గా ఆయన సేవలు అందించారు. 1990 నుంచి 92 వరకు రెండేళ్ల పాటు ఆయనీ పదవిలో ఉన్నారు. అంతకుముందు 1985 నుంచి 1989 వరకు కేంద్రంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టక ముందు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగానూ వ్యవహరించారు. 

భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన వెంకటరమణన్ నిర్మాణాత్మక ఆలోచనలతో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం చెల్లింపు నిల్వల సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో తన ఆర్థిక మేధోశక్తితో ఆ సమస్యకు పరిష్కారాలు చూపారు.

More Telugu News