KCR: తెలంగాణలో గెలిచి.. మహారాష్ట్రకు వస్తానని బీజేపీ, కాంగ్రెస్‌లకు భయం పట్టుకుంది: కేసీఆర్

  • బచ్చన్నపేట మీదుగా వెళ్తూ... అక్కడ ఆగి గొడగొడ ఏడ్చానన్న కేసీఆర్
  • బీఆర్ఎస్ చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర తెలుసుకొని ఓటు వేయాలన్న కేసీఆర్
  • జనగామకు కుక్కలు వచ్చి మొరిగాయని పల్లా రాజేశ్వర్ రెడ్డి బాధపడుతున్నారని కేసీఆర్ చలోక్తులు
  • సిద్దిపేట, చేర్యాల కలిసే ఉంటాయి... చేర్యాల కష్టాలు తెలుసునన్న కేసీఆర్
  • తెలివితో ఓటేస్తే తెలివైన ప్రభుత్వం వస్తుందన్న ముఖ్యమంత్రి
  • ముత్తిరెడ్డికి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు
KCR Praja Ashirvada Meeting in Cheriyal

రైతుబంధు వృథా అని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. శనివారం జనగామ నియోజకవర్గం చేర్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ... పల్లా రాజేశ్వర రెడ్డిని గెలిపిస్తే రైతుబంధు క్రమంగా రూ.16వేలకు పెంచుతామన్నారు. బీఆర్ఎస్ మీ కళ్లముందే పుట్టిన పార్టీ అన్నారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ అన్నారు. కానీ కాంగ్రెస్ చరిత్ర అందరికీ తెలిసిందేనని, తెలంగాణను ముంచిందే ఆ పార్టీ అన్నారు. 58 ఏళ్ల పాటు తెలంగాణకు నష్టం చేసిందన్నారు. 2004లో మనతో పొత్తు కారణంగానే కాంగ్రెస్... తెలంగాణలో, ఢిల్లీలో అధికారంలోకి వచ్చిందని, అయినా రాష్ట్రాన్ని ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. దీంతో తెలంగాణ కోసం అందరం ఉద్యమించామన్నారు. చివరకు కేసీఆర్ చచ్చుడో... తెలంగాణ వచ్చుడో అని తాను ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ సాధించానన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పాలన, ఈ పదేళ్ల బీఆర్ఎస్ పాలనను పోల్చుకోవాలన్నారు.

జీవనదుల మధ్య ఉన్న తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు. దగ్గరలోనే ఉన్న బచ్చన్నపేట చెరువులో గత పాలకుల సమయంలో నీళ్లు లేకుండెనని, ఉద్యమం సమయంలో ఇటు నుంచి వెళ్తున్న తాను ఓ సందర్భంలో బచ్చన్నపేటలో ఆగి  గొడగొడ ఏడ్చానన్నారు (బాగా ఏడ్చానన్నారు). కానీ ఇప్పుడు అదే బచ్చన్నపేట చెరువులో నిత్యం నీళ్లు ఉంటున్నాయన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఇంటికి కాలువ నీరు వచ్చిందని, మంచి నీళ్లు వచ్చాయని, 24 గంటల విద్యుత్ ఇస్తున్నామన్నారు. ఇటీవల జనగామకు వచ్చి కుక్కలు వచ్చి మొరిగిపోయాయని పల్లా రాజేశ్వర రెడ్డి బాధపడుతున్నారని, కానీ కుక్కలు మొరుగుతూనే ఉంటాయని విపక్షాలను ఉద్దేశించి అన్నారు. కేసీఆర్‌కు పిండం పెట్టాలని అంటున్నారని, కానీ ప్రజలు ఎవరికి పిండం పెట్టాలో నిర్ణయించాలన్నారు. సిద్దిపేట, చేర్యాల కలిసే ఉంటాయని, కాబట్టి చేర్యాల కష్టాలు తనకు తెలుసునన్నారు.

ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్‌ను మూడోసారి గెలిపిస్తే పెన్షన్ మరింతగా పెంచుతామన్నారు. ఓట్ల కోసం మేం దొంగ మాటలు చెప్పమన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మనం ఇచ్చినంత పెన్షన్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గత యాభై ఏళ్లలో చేసిన వాగ్ధానాలను మనం చూడలేదా? ఎన్ని సినిమాలు చూయించారో తెలియదా? అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ హామీలు అంటే నమ్ముతామా? అన్నారు. కొంతమంది తమ పార్టీ విధానాలను చెప్పకుండా కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ప్రజలు అభ్యర్థుల గుణగణాలు, పార్టీల తీరును గమనించాలన్నారు. తెలివితో ఓటు వేస్తేనే తెలివైన ప్రభుత్వం వస్తుందన్నారు.

విద్యుత్ 24 గంటలు ఉండాలంటే పల్లా రాజేశ్వరరెడ్డి గెలవాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే విద్యుత్ మూడు గంటలు మాత్రమే ఇస్తారని హెచ్చరించారు. కర్ణాటక నుంచి వచ్చిన కాంగ్రెస్ నేతలు వచ్చి తమ వద్ద 5 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నారని, కానీ ఇక్కడ 24 గంటలు ఇస్తున్న విషయం వారు గుర్తించాలన్నారు. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, మళ్లీ పట్వారి వ్యవస్థను పట్టుకువస్తారా? అని నిలదీశారు. మళ్లీ దళారుల రాజ్యం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందన్నారు. ధరణి వల్ల మీ భూములను ముఖ్యమంత్రి కూడా మార్చలేరన్నారు.

రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పించిందే కాంగ్రెస్ అన్నారు. బీహార్ నుంచి జీఆర్ రెడ్డిని పిలిపించి పథకాలపై అధ్యయనం చేశానన్నారు. పెన్షన్లు రూ.1000తో ప్రారంభించి రూ.2వేలకు పెంచామని, మళ్లీ గెలిపిస్తే రూ.5వేలకు పెంచుతామన్నారు. సంపద పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలు పెంచుకుంటూ వెళ్తామన్నారు. బోరు మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని మోదీ చెబితే తాను ససేమీరా అన్నానని చెప్పారు. ఏది మంచిదో చర్చించి ప్రజలు ఓటు వేయాలన్నారు. పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును కొనుక్కొచ్చుకుంటారా? అని ప్రశ్నించారు. కరెంట్ వేస్ట్, రైతుబంధు వేస్ట్ అనేవాళ్లు మీకు అవసరమా? అన్నారు. జనగామలో, సిద్దిపేటలో మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరైనా అనుకున్నారా? అన్నారు. కేసీఆర్‌ను చూస్తుంటే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు భయం పట్టుకుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే మహారాష్ట్రకు వస్తానని వారు భయపడుతున్నారన్నారు. చేర్యాల చైతన్యం ఉంటే గడ్డ అని, చేర్యాల అంటే తనకు ఇష్టమన్నారు. తరిగొప్పుల, లద్నూరు, తదితర ప్రాంతాల్లో తనకు మంచి మిత్రులు ఉన్నారన్నారు.

ముత్తిరెడ్డికి ధన్యవాదాలు

ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి మించి పల్లా రాజేశ్వర రెడ్డి పని చేస్తారని కేసీఆర్ అన్నారు. అందుకే యాదగిరి రెడ్డికి ఆర్టీసీ చైర్మ్ పదవి ఇచ్చానని, ఆయన కూడా పల్లాకు టిక్కెట్ ఇస్తే సహకరించారన్నారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు అన్నారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా పల్లాకు సహకరిస్తున్నారన్నారు.

More Telugu News