Rohit Sharma: రోహిత్ 2022లోనే దినేశ్ కార్తీక్‌కు చెప్పాడు.. ఇప్పుడు చేసి చూపించాడు!

  • 2022లో దినేశ్ కార్తీక్‌తో రోహిత్ చెప్పిన మాటలను గుర్తు చేసిన నాసర్ హుస్సేన్
  • సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో దారుణ పరాభవం తర్వాత జట్టు మారాల్సిన అవసరం ఉందన్న రోహిత్
  • నేడు మార్చి చూపించాడన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
Rohit Sharma Told This To Dinesh Karthik In 2022 Says Nasser Hussain

ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాలతో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. 2019 ప్రపంచకప్‌‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఎదురైన ఓటమికి ఈ టోర్నీలో ప్రతీకారం తీర్చుకుంది. 70 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. రేపు ఆస్ట్రేలియాతో ఫైనల్‌లో తలపడనుంది. ఈ సందర్భంగా 2022 టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో దారుణ పరాభవం తర్వాత దినేశ్ కార్తీక్‌తో రోహిత్‌శర్మ చేసిన వ్యాఖ్యలను ఇంగ్లండ్ మాజీ స్కిప్పర్ నాసర్ హుస్సేన్ గుర్తు చేశాడు. 

ఆ మ్యాచ్‌లో ఇండియా 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌కు నిర్దేశించింది. ఆ జట్టు ఓపెనర్లు జోస్ బట్లర్ (80*), అలెక్స్ హేల్స్ (86*) ఇద్దరే నిలబడి కొట్టేశారు. 16 ఓవర్లలోనే జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఓటమి అనంతరం వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్‌తో రోహిత్ మాట్లాడుతూ.. జట్టులో ‘మార్పు’ అవసరమని చెప్పాడని నాసర్ హుస్సేన్ గుర్తు చేశాడు. జట్టు మారాల్సిన అవసరం ఉందని నాడు చెప్పిన రోహిత్.. ఈ రోజు హీరోగా మారాడని ప్రశంసించాడు. జట్టును పూర్తిగా మార్చేశాడని కొనియాడాడు. నిర్భయంగా ఆడి ఫైనల్‌కు దూసుకెళ్లారని హుస్సేన్ కొనియాడాడు.

More Telugu News