ఏపీకి తుపాను ముప్పు లేనట్టే!

  • పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాను
  • 'మిధిలీ'గా నామకరణం 
  • ఉత్తర వాయవ్య దిశగా పయనం
  • రేపు బంగ్లాదేశ్ వద్ద తీరం దాటనున్న తుపాను 
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి 'మిధిలీ' అని నామకరణం చేశారు. మాల్దీవులు సూచించిన మేరకు ఈ పేరు పెట్టారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఈ తుపాను ఒడిశాలోని పరదీప్ కు దక్షిణ ఆగ్నేయంగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

గంటకు 20 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఈ తుపాను రేపు (నవంబరు 18) తెల్లవారుజామున బంగ్లాదేశ్ తీరంలోని ఖెపుపారా వద్ద తీరం దాటనుంది. ఇది భూభాగంపైకి ప్రవేశించే సమయంలో బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో గంటకు 80 కి.మీ పైగా వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

ఈ తుపాను ప్రభావం ఏపీపై ఉండదని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి విభాగం పేర్కొంది.

Cyclone Mythili
Bay Of Bengal
Bangladesh
Andhra Pradesh

More Telugu News