K Kavitha: బీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుంది: ఎమ్మెల్సీ కవిత ధీమా

  • పార్టీ అభ్యర్థి సంజయ్ తరఫున కోరుట్లలో కవిత ప్రచారం
  • సంజయ్ గెలిస్తే రైతుబంధు సాయం పెరుగుతుందన్న కవిత
  • గందరగోళంలో ఇతరులకు అవకాశమిస్తే మాటమీద నిలబడరన్న కవిత
Kavitha says BRS will win 100 seats

కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ గెలిస్తేనే రైతుబంధు సాయం పెరుగుతుందని... పెన్షన్ సాయం పెరుగుతుందని... ప్రజాసంక్షేమ పథకాలు పెరుగుతాయని... విద్యుత్ ఇరవై నాలుగు గంటలు వస్తుందని... గ్యాస్ సిలిండర్ రూ.400కే వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కోరుట్లలో ఆమె డాక్టర్ సంజయ్ తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో గందరగోళపడి ఇతరులకు అవకాశం ఇస్తే వారు మాట మీద నిలబడేవారు కాదన్నారు. అలాంటి వారిని గెలిపించి ఏం సాధిస్తాం? అని ప్రజలను ప్రశ్నించారు. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌ని గెలిపించాలన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కచ్చితంగా వంద సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్‌తో కోహ్లీని పోల్చిన కవిత

ఎమ్మెల్సీ కవిత నిన్న తన తండ్రి, సీఎం కేసీఆర్‌తో క్రికెటర్ విరాట్ కోహ్లీని పోలుస్తూ ట్వీట్ చేశారు. వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ మీద టీమిండియా గెలిచింది. ఈ సందర్భంగా కోహ్లీ రికార్డులపై ఆమె ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా స్పందిస్తూ... ముఖ్యమంత్రి కేసీఆర్‌లా విరాట్ కోహ్లీ కూడా ఓటమిలేనివాడని, మాస్టర్స్ ఫీల్డులో ఉన్నప్పుడు మ్యాజిక్ జరుగుతుందంటూ కేసీఆర్, కోహ్లీ పోటోను షేర్ చేశారు. 'క్రికెట్ లో కోహ్లీకి తిరుగులేదు.. తెలంగాణలో కేసీఆర్‌కు ఎదురులేదు అని ఫోటోను షేర్ చేశారు.

More Telugu News