world cup 2023: రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్ చేశాడు.. పాక్ మాజీ ఆటగాడి సంచలన ఆరోపణ.. వీడియో ఇదిగో!

  • కాయిన్ ను దూరంగా పడేలా వేయడం వెనకున్న కారణమదేనన్న సికందర్ భక్త్
  • ప్రత్యర్థి జట్టు కెప్టెన్ నాణెంను పరీక్షించే అవకాశం ఇవ్వకూడదనే అలా చేశాడని ఫైర్
  • ఐసీసీ అధికారులు టీమిండియా కెప్టెన్ కు ఫేవర్ గా వ్యవహరించారని విమర్శ
Rohit Sharma FIXING Toss Pakistan Ex Cricketer Makes Controversial Claim

వరల్డ్ కప్ మెగా టోర్నీలో కొత్త వివాదం రేగుతోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడంటూ పాక్ మాజీ ఆటగాడు సికందర్ భక్త్ సంచలన ఆరోపణలు చేశాడు. మ్యాచ్ కు ముందు టాస్ వేసే ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం ఎవరికైనా అర్ధమవుతుందన్నాడు. టాస్ కోసం ఐసీసీ అధికారులు నాణెం అందించిన ప్రతిసారీ రోహిత్ దానిని దూరంగా పడేలా విసిరేశాడన్నారు.

రోహిత్ టాస్ వేయడంతో ప్రత్యర్థి జట్టు కెప్టెన్ తన చాయిస్ చెప్పాల్సి వచ్చిందని, వారు హెడ్స్ చెబితే టెయిల్, టెయిల్ చెబితే హెడ్స్ పడిందని ఐసీసీ అధికారులు చెప్పారన్నారు. కాయిన్ దూరంగా పడడంతో కెప్టెన్ కు క్రాస్ చెక్ చేసే అవకాశం లేకుండా పోయిందని భక్త్ ఆరోపించాడు. అసలు కాయిన్ ను దూరంగా పడేలా చేయడమే ఫిక్సింగ్ కోసమని మండిపడ్డాడు.

ఐసీసీ అధికారులు ఎలాగూ తనకు అనుకూలంగానే చెబుతారని, ప్రత్యర్థి జట్టు కెప్టెన్ కు క్రాస్ చెక్ చేయకుండా చూసుకుంటే సరిపోతుందని రోహిత్ శర్మ ప్లాన్ చేశాడని విమర్శించాడు. పాకిస్థాన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సికందర్ భక్త్ ఈ సంచలన ఆరోపణలు చేశాడు. తన ఆరోపణలకు మద్దతుగా రోహిత్ శర్మ టాస్ వేసిన వీడియోలను చూపెట్టాడు. ఆ వీడియోలలో రోహిత్ పైకి విసిరిన ప్రతిసారీ కాయిన్ దూరంగా పడడం గమనించవచ్చు. భక్త్ ఆరోపణల నేపథ్యంలో ఐసీసీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

More Telugu News