KCR: గజ్వేల్ బరిలో 44 మంది అభ్యర్థులు, కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు

  • గజ్వేల్ నుంచి ఈ రోజు 70 మంది నామినేషన్ల ఉపసంహరణ
  • కామారెడ్డిలో 19 మంది నామినేషన్ల ఉపసంహరణ
  • ఈ రెండు నియోజకవర్గాల్లో కేసీఆర్ పోటీ కారణంగా సంతరించుకున్న ప్రాధాన్యత
44 candidates are contesting from Gajwel

గజ్వేల్ నుంచి ఎన్నికల బరిలో 44 మంది అభ్యర్థులు ఉన్నారని రిటర్నింగ్ అధికారి బుధవారం తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. గడువు ముగిసిన అనంతరం బరిలో ఎంతమంది ఉన్నారో రిటర్నింగ్ అధికారి తెలిపారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తోన్న గజ్వేల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్... కామారెడ్డి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీ చేస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల స్క్రూటినీ తర్వాత 114 మంది బరిలో ఉండగా, ఈ రోజు 70 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో గజ్వేల్‌లో 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి తూముకుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నారు.

కామారెడ్డిలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 39 మంది బరిలో నిలిచారు. స్క్రూటినీ తర్వాత 58 మంది పోటీలో ఉండగా, ఆ తర్వాత 19 మంది నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 39 మంది పోటీలో ఉన్నట్లు చెప్పారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి వెంకటరమణారెడ్డి పోటీలో ఉన్నారు.

More Telugu News