Subratha Roy: సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ కన్నుమూత

  • అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలంగా బాధపడుతున్న రాయ్
  • ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన సహారా గ్రూపు
Sahara Group founder Subrata Roy passes away

సహారా గ్రూపు వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సుబ్రతా రాయ్ (75) మంగళవారం కన్నుమూశారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో తుదిశ్వాస విడిచారని కంపెనీ తెలిపింది. ప్రాణాంతక మెటాస్టాటిక్, బీపీ, మధుమేహం వ్యాధులతో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆయన ఈ ఆదివారం కార్డియోరెస్పిరేటరీ అరెస్ట్‌‌కు గురయ్యారని, చికిత్స పొందుతూ కన్నుమూశారని ఓ ప్రకటనలో కంపెనీ పేర్కొంది. ఆయన మృతితో కంపెనీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని పేర్కొంది.

సుబ్రతా రాయ్‌కి భార్య స్వప్నా రాయ్, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కుమారులు సుశాంతో రాయ్, సీమాంటో రాయ్ విదేశాల్లో ఉంటున్నారు. సుబ్రతా రాయ్ 1948లో బీహార్‌లోని అరారియాలో పుట్టారు. 1978లో ‘సహారా ఇండియా పరివార్’ ప్రారంభించడంతో ఆయన సక్సెస్ స్టోరీ మొదలైంది. కేవలం రూ.2,000 మూలధనంతో ప్రారంభించినప్పటికీ వ్యవస్థాపకత విషయంలో కంపెనీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సుబ్రతా రాయ్ కృషి చేశారు. లక్నోను కేంద్రంగా చేసుకొని కంపెనీ కార్యకలాపాలను నిర్వహించారు. అయితే ‘సహారా చిట్ ఫండ్ స్కామ్’ కేసులో కంపెనీ అనేక సమస్యలను ఎదుర్కొంది. సుబ్రతా రాయ్ మృతిపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

More Telugu News