rs praveen kumar: బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం

  • కాగజ్ నగర్ పరిధిలోని పెద్దవాగు వద్ద ఆగిన ప్రవీణ్ కుమార్ కాన్వాయ్
  • వెనుక వైపు నుంచి బలంగా ఢీకొన్న లారీ
  • ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా అందరూ సురక్షితం
RS Praveen Kumar car meet with an accident

బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్‌నగర్ పట్టణ పరిధిలోని పెద్దవాగు వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఆగి ఉండగా వెనుక వైపు నుంచి లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారం

ఎన్నికల్లో కేసీఆర్ నియంతృత్వ, దోపిడీ పాలనకు చరమగీతం పాడాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నేత రాజ్ కుమార్ యాదవ్ పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రా నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యే కొనేరు కోనప్ప సిర్పూర్ ప్రాంత ప్రజలపై దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడుతూ వనరులు, సంపాదనను దోచుకొని అక్రమంగా వందల కోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. కోనప్ప దౌర్జన్యాలను ప్రశ్నించే వారిపై పోలీసులతో అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు.

జిల్లా ఎస్పీ సహా అధికారులందరూ ఉత్సవ విగ్రహాలుగా మిగిలి, కోనేరు కోనప్ప చేతిలో బందీ అయ్యారన్నారు. భీమిని మండలం చిన్నగుడిపేట గ్రామస్తులు ఓట్ల కోసం వచ్చిన ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై తిరగబడి, తరిమికొట్టారన్నారు. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి కనీసం రోడ్లు కూడా వేయలేని మీరు ఏం వెలగబెట్టారు? అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు ఓట్ల కోసం పల్లెల్లో తిరుగుతున్నారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని కోనప్ప చేస్తున్న అరాచకాలకు నవంబర్ 30న ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ చేసే రాజకీయ పోరాటం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో కాదని, కోనప్ప దౌర్జన్యాలను అడ్డుకోవడం కోసం పార్టీలకతీతంగా ప్రజలందరూ ఒక్కటై బీఎస్పీని గెలిపించాలన్నారు.

More Telugu News