Karnataka: కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వేగంగా పుంజుకుంది: కర్ణాటక మంత్రి దినేశ్ గూండురావు

  • కాంగ్రెస్ అంటే ఏమిటో వివిధ రాష్ట్రాల్లో గెలిచి చూపించామన్న దినేశ్
  • అభివృద్ధి నినాదం మీద ఏర్పడిన తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో ఉందని విమర్శ
  • కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను 3 నెలల్లోనే అమలు చేశామని వెల్లడి
Karanataka minister Dinesh Gundurao in telangana

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ దేశవ్యాప్తంగా వేగంగా పుంజుకుందని కర్ణాటక మంత్రి దినేశ్ గూండురావు అన్నారు. ప్రస్తుతం అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, అన్నింటా తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాదులోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ముక్త్ భారత్‌ను బీజేపీ కోరుకుందని... కానీ కాంగ్రెస్ ఏమిటో వివిధ రాష్ట్రాలలో గెలిచి చూపించామన్నారు. తెలంగాణలో తాము బీఆర్ఎస్‌ను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. 

కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వేగంగా పుంజుకుందన్నారు. అభివృద్ధి నినాదం మీద ఏర్పడిన తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో ఉందన్నారు. తెలంగాణ మిగులు నిధులతో ఆర్థికంగా బలమైన రాష్ట్రమని... కానీ ఆ తర్వాత జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను 3 నెలల్లోనే అమలు చేశామన్నారు.

కేంద్రం మద్దతు లేకపోయినా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు గూండురావు చెప్పారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. విద్యుత్ విషయంలో తెలంగాణ పరిస్థితులకు, కర్ణాటక పరిస్థితులకు చాలా తేడా ఉందని చెప్పారు. అయినా కర్ణాటకలో ఎలాంటి సమస్య లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు ఏమైనా అనుమానం ఉంటే కర్ణాటకకు రావొచ్చునని చెప్పారు. సాధారణ పౌరులకు ఎలాంటి సమస్య లేకుండా కరెంట్ చార్జీలు అమలు చేస్తున్నామన్నారు. కర్ణాటక రైతుల ధర్నా... కావాలని ఆడిస్తున్న డ్రామా అని మండిపడ్డారు.

More Telugu News