Diwali: పక్షులపై ప్రేమ.. తమిళనాడులోని ఈ గ్రామస్థుల దీపావళి అందరికీ ఆదర్శం!

  • తమిళనాడులోని ఈరోడ్‌కు సమీపంలో పక్షి అభయారణ్యం
  • వేలాది స్థానిక, వలస పక్షులకు ఆవాసం
  • అక్టోబర్ నుంచి జనవరి వరకు గుడ్లు పెట్టి పొదిగే కాలం
  • వాటి ప్రశాంతతకు భంగం కలగకుండా నిశ్శబ్దంగా దీపావళి
  • రెండు దశాబ్దాలుగా ఇక్కడిలాగే దీపావళి 
villages around bird sanctuary celebrate Diwali without firecrackers in Tamil Nadu

తమిళనాడు ఈరోడ్ జిల్లాలోని ఏడు గ్రామాల ప్రజలు జరుపుకున్న దీపావళి అందరికీ ఆదర్శంగా నిలిచింది. బాణసంచా కాల్చకుండానే ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకున్నారు. ఈరోడ్‌కు 10 కిలోమీటర్ల దూరంలోని వడముగమ్ వెల్లోడ్‌లో పక్షుల అభయారణ్యం ఉంది. అక్టోబరు నుంచి జనవరి వరకు పక్షులు గుడ్లు పెట్టి పొదిగే కాలం కావడంతో దాని పరిధిలోని ఏడు గ్రామాల ప్రజలు వాటికి భంగం కలిగించకుండా దీపావళి జరుపుకున్నారు. ఈ అభయారణ్యంలో వేలాది స్థానిక, వలస పక్షులు నివసిస్తుంటాయి. 

ఈ నేపథ్యంలో వాటి ప్రశాంతతకు ఏమాత్రం హాని కలగకుండా దాదాపు 900 కుటుంబాలు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా పండుగ జరుపుకున్నాయి. ఇప్పుడే కాదు.. గత 22 ఏళ్లుగా అభయారణ్యం సమీప గ్రామాల ప్రజలు ఇలా సైలెంట్‌గా దీపావళి జరుపుకుని పక్షులపై తమ ప్రేమను చాటుకుంటున్నారు. ఒక్కటంటే ఒక్క మతాబు కానీ, శబ్దం చేసే, కాలుష్యాన్ని వెదజల్లే బాణసంచా కానీ కాల్చరు. సెల్లప్పంపాలయం, వడముగ వెల్లోడ్, సెమ్మందంపాలయం, కరుక్కన్కట్టు వలసు, పుంగంపాడి సహా మరో రెండు గ్రామాలు ఇలా నిశ్శబ్ద దీపావళిని జరుపుకుంటాయి.

More Telugu News