Ayodhya Deepotsav: అత్యద్భుతమంటూ అయోధ్య దీపోత్సవ్ ఫొటోలను షేర్ చేసిన ప్రధాని మోదీ

  • 22.23 లక్షల దీపాలతో అయోధ్యలో దీపోత్సవ్
  • మరపురాని వేడుకగా అభివర్ణించిన ప్రధాని మోదీ
  • 50 దేశాల రాయబారులు, అధికారుల హాజరు
  • గతేడాది కంటే 6.47 లక్షల దీపాలు అధికం
  • తన రికార్డును తనే బద్దలుగొట్టి గిన్నిస్ రికార్డుల్లోకి
 PM Narendra Modi shares Ayodhya Deepotsav pictures on Diwali

దీపావళిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవ్ ఫొటోలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. సరయూ నది తీరంలో నిర్వహిచిన ఈ వేడుకలో భాగంగా ఒకేసారి 22.23 లక్షలకు పైగా దీపాలు వెలిగించారు. గతేడాది కంటే 6.47 లక్షల దీపాలను అధికంగా వెలిగించారు. ఇది ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ను  సొంతం చేసుకుంది. ఈ ఫొటోలను పంచుకున్న మోదీ దీపోత్సవాన్ని అత్యద్భుతమైన, మరపురాని వేడుకగా అభివర్ణించారు.
 గతేడాది 15 లక్షల దీపాలు వెలిగించి నెలకొల్పిన రికార్డును ఈసారి అంతకుమించిన దీపాలతో అయోధ్య తన రికార్డును తానే బద్దలుకొట్టింది. ఈ కార్యక్రమంలో 25 వేల మందికిపైగా వలంటీర్లు భాగస్వాములయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయోధ్యలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలి ఏడాది 51 వేల దీపాలు వెలిగించారు. ఆ తర్వాతి నుంచి ప్రతి ఏడాది పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ ఏడాది దీపోత్సవ్‌లో 50 దేశాల రాయబారులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

More Telugu News