K Kavitha: పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఈటల, రేవంత్ రెడ్డిల తీరు ఉంది: కవిత

  • ఈటల, రేవంత్ రెడ్డిలు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడంపై విమర్శలు
  • ఎన్నికల్లో వారికి వాతలు తప్పితే ఫలితం ఉండదని వ్యాఖ్య
  • కర్ణాటకలో కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారన్న కవిత
Kavitha lashes out at Etala Rajender and Revanth Reddy

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిల తీరు ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డిలు రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత... ఈటల, రేవంత్‌లపై విమర్శలు గుప్పించారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో వారికి వాతలు తప్పితే ఫలితం మాత్రం ఉండదని వ్యాఖ్యానించారు.

నిజామాబాద్‌లో గోసంగి సామాజికవర్గం ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కర్ణాటకలో చక్కదనం లేదు కానీ అక్కడి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇక్కడ కామారెడ్డికి వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పాలన తీరు చూసి అక్కడి ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అభివృద్ధి ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఓటు వేసే ముందు అంతకుముందు ఎలా ఉండింది... ఇప్పుడు ఎలా ఉండింది? అన్నది చూసుకోవాలన్నారు.

More Telugu News