Harish Rao: హుజూరాబాద్‌లో ఏ పార్టీకి ఎన్నో స్థానం వస్తుందో చెప్పిన హరీశ్ రావు!

  • బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి విజయం సాధిస్తారన్న హరీశ్ రావు
  • కాంగ్రెస్ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉంటాయని జోస్యం
  • బీఆర్ఎస్ గెలిస్తే ఇచ్చే పథకాలు వెల్లడించిన హరీశ్ రావు
Harish Rao predicts huzurabad election

హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డి భారీ విజయాన్ని సాధిస్తారని, కాంగ్రెస్ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉంటాయని మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. హుజూరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హుజూరాబాద్‌లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయన్నారు. కౌశిక్ రెడ్డి ప్రజాజీవితంలో ఆల్ రౌండర్ అని, ముఖ్యమంత్రికి చాలా ఇష్టమైన వ్యక్తి అని అన్నారు. గెలిచాక ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి నిధులు తీసుకు వస్తారన్నారు. ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిచారు కానీ పిడికెడు మట్టి తీయలేదన్నారు.

కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ గెలిచినా తెలంగాణ తిరిగి అంధకారంలోకి వెళ్తుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సౌభాగ్యలక్ష్మి కింద ప్రతి మహిళకు నెలకు రూ.3వేలు ఇస్తామన్నారు. ఆరోగ్యశ్రీని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచుతామన్నారు. కేసీఆర్ ధీమా... ఇంటింటికి బీమా కింద రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఎవరైనా మృతి చెందితే  రూ.5 లక్షలు ఇస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ రూ.400కే అందిస్తామన్నారు. హుజూరాబాద్‌లో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములకు సంబంధించి పట్టాలిస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఏది కావాలన్నా ఢిల్లీ దగ్గర మోకరిల్లాల్సిందే అన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్న మన వద్దకు వచ్చి కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మోటార్లు జీపులో వేసుకొని వెళ్తారన్నారు. కాంగ్రెస్ నేతలు రైతు బంధు దుబారా అని మాట్లాడుతున్నారని విమర్శించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతుబంధు తీసుకునే వారిని బిచ్చగాళ్లతో పోలుస్తూ మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు.

More Telugu News