ICC: శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసిన ఐసీసీ

  • వరల్డ్ కప్ లో శ్రీలంక ఘోర వైఫల్యం
  • శ్రీలంక బోర్డు సభ్యులందరినీ తొలగించిన క్రీడల మంత్రి
  • క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యం నిబంధనలకు విరుద్ధమన్న ఐసీసీ
  • సభ్య దేశాల జాబితా నుంచి శ్రీలంకను తొలగిస్తున్నట్టు ప్రకటన
ICC suspends Sri Lanka Cricket Board

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసింది. శ్రీలంక క్రికెట్ వ్యవహారాల్లో ప్రభుత్వ, రాజకీయ జోక్యం కనిపిస్తోందంటూ... లంక క్రికెట్ బోర్డును ఐసీసీ తన సభ్య దేశాల జాబితా నుంచి తొలగించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఓ సభ్య దేశంగా ఐసీసీ నియమావళిని శ్రీలంక క్రికెట్ బోర్డు తీవ్రస్థాయిలో ఉల్లంఘించిందని ఐసీసీ పేర్కొంది. ఐసీసీ సభ్య దేశాల క్రికెట్ బోర్డుల్లో ప్రభుత్వ, రాజకీయ జోక్యం ఉండరాదన్న నిబంధనను శ్రీలంక క్రికెట్ అతిక్రమించిందని వివరించింది. స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవడంలో విఫలమైందని తెలిపింది. ఈ కారణంగానే శ్రీలంక క్రికెట్ బోర్డుపై వేటు వేస్తున్నట్టు ఐసీసీ స్పష్టం చేసింది. 

ఐసీసీ తాజా చర్యలకు బలమైన కారణమే ఉంది. వరల్డ్ కప్ టోర్నీలో శ్రీలంక జట్టు దారుణ ప్రదర్శన కనబర్చడం తెలిసిందే. 9 మ్యాచ్ లు ఆడి 7 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. దాంతో టోర్నీ నుంచి ఎప్పుడో నిష్క్రమించింది. 

ముఖ్యంగా, టీమిండియా చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. ఆసియా కప్ ఫైనల్లో ఎలా కుప్పకూలిందో, వరల్డ్ కప్ లోనూ టీమిండియా బౌలర్ల ధాటికి కకావికలమైంది. దాంతో శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యలందరిపైనా ఆ దేశ క్రీడల మంత్రి రోషన్ రణసింఘే వేటు వేశారు. బోర్డు తాత్కాలిక పాలనాధ్యక్షుడిగా మాజీ సారథి అర్జున రణతుంగను నియమించారు. ఈ అంశమే ఐసీసీ ఆగ్రహానికి కారణమైంది.

More Telugu News