Telugudesam: ముఖ్యమంత్రి తమ్ముడు అనిల్ రెడ్డిని అరెస్టు చేయాలి: టీడీపీ నేత దేవినేని ఉమ

  • మంత్రి పెద్దిరెడ్డిని బర్త్ రఫ్ చేయాలని డిమాండ్
  • ఇసుక కొల్లగొడుతున్న జగన్ అస్మదీయుల దొంగతనం బయటపడిందని ఆరోపణలు
  • ‘ఎక్స్’ వేదికగా స్పందించిన టీడీపీ సీనియర్ నేత
Chief Ministers brother Anil Reddy should be arrested says TDP leader Devineni Uma

కృష్ణా నదిలో ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న ముఖ్యమంత్రి జగన్ అస్మదీయుల ఇసుక  దొంగతనం బయటపడిందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ అన్నారు. మంత్రి పెద్దిరెడ్డిని బర్త్ రఫ్ చేయాలని, ముఖ్యమంత్రి తమ్ముడు అనిల్ రెడ్డిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దొంగ బిల్లులతో ఓవర్ లోడ్లతో తరలిస్తున్న దొంగ ఇసుక డబ్బులు తాడేపల్లి ఖజానాకు వెళుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. ఇసుక అక్రమ తరలింపునకు సంబంధించినదంటూ ఓ బిల్లును చూపించి ఆయన మాట్లాడారు. బిల్లులో చూపించని డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని ఆయన ప్రశ్నించారు.
 
మరోవైపు.. నేషనల్ హైవేపై గుంటుపల్లి వద్ద పోలీసుల అత్యుత్సాహం కారణంగా ప్రమాదం జరిగిందని దేవినేని ఉమ అన్నారు. మంత్రి జోగి రమేష్ ఎస్కార్ట్ వాహనం కారణంగా లారీ ప్రమాదానికి గురైందని, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడని అన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన పోలీసు వాహనానికి ఇన్సూరెన్స్ లేదని పేర్కొన్నారు. పోలీసు వాహనం లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ భయపడి డివైడర్ ఎక్కించాడని, ఈ ఎస్కార్ట్ వాహనం రిపేరు మొత్తం నువ్వే చేయించాలంటూ డ్రైవర్‌కు బెదిరింపులు వస్తున్నాయని ఆయన అన్నారు. ఎస్కార్ట్ వాహనంలోని ఆరుగురు పోలీసుల్లో ఇప్పుడు ఒక్కరు కూడా కనబడడం లేదని తెలిపారు. ఈ మేరకు ఘటనా స్థలంలోనే ఆయన మాట్లాడారు. లారీల వద్ద గ్రీన్ టాక్స్‌లు, రోడ్డు టాక్స్‌లు, ఇన్సూరెన్స్‌లు అంటూ ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తోందని మండిపడ్డారు. పోలీసు వాహనానికి ఇన్సూరెన్స్ ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయంలో డ్రైవర్లు ఓనర్లు అయితే.. జగన్ రెడ్డి హయాంలో ఓనర్లు క్లీనర్లు అయ్యారని దేవినేని ఉమ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

More Telugu News