USA: రెప్పతో పాటు కంటిని సమూలంగా మార్చిన వైద్యులు

  • సంక్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించిన న్యూయార్క్ వైద్యులు
  • హైవోల్టేజీ తీగలు తాకి కన్ను కోల్పోయిన వ్యక్తికి శస్త్రచికిత్స
  • చూపు వచ్చేది, లేనిది త్వరలోనే వెల్లడి
Newyork Doctors changed the eye including the eyelid with surgery

ప్రపంచంలోనే తొలిసారి అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా ఓ వ్యక్తి కంటిని సమూలంగా మార్చివేశారు. న్యూయార్క్‌‌లోని లాంగోన్‌హెల్త్‌ హాస్పిటల్ వైద్యులు ఈ ఘనత సాధించారు. ఓ ప్రమాదంలో కోల్పోయిన కుడి కంటిని రెప్పతో సహా సంపూర్ణంగా మార్చాలని, తద్వారా ముఖానికి కొత్తరూపు ఇవ్వొచ్చని ఈ చికిత్స నిర్వహించారు. భావించిన విధంగానే మే నెలలో ఏకంగా 21 గంటలు శ్రమించి శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ కొత్త కన్ను ఆరోగ్యంగానే ఉందని ఈ మేరకు వైద్యులు గురువారం ప్రకటన చేశారు.

కన్నును మూసి, తెరవడం సాధ్యం కాకపోయినప్పటికీ కంటిపై స్పర్శ మాత్రం తెలుస్తోందని పేషెంట్ ఆరన్ జేమ్స్‌ చెప్పారు. అయితే ఆ కన్ను ద్వారా అతడికి చూపు వస్తుందా? లేదా? అనేది త్వరలోనే తెలియనుంది. అంధత్వాన్ని, దృష్టి లోపాలను సరిచేయడానికి కార్నియా మార్పిడి వంటి శస్త్రచికిత్సలు ఎన్ని చేస్తున్నా ఏకంగా పూర్తిగా కన్నును మార్చడం వైద్యుల సరికొత్త ఘనత చెప్పాలి. ఈ శస్త్రచికిత్స భవిష్యత్తులో ఎన్నో నూతన ప్రయోగాలకు నాంది పలుకుతుందని వైద్యులు ఆకాంక్షించారు. కాగా కంటి మార్పిడి చేయించుకున్న ఆరన్ జేమ్స్ ప్రమాదవశాత్తూ హైవోల్టేజీ విద్యుత్ తీగలను తాకాడు. ఈ ఘటనలో అతడి ముఖంలో అధిక భాగం కాలిపోయింది. కుడి కన్ను పూర్తిగా పోయింది. అందుకే వైద్యులు ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది.

More Telugu News