Cricket: పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ఇంగ్లండ్‌పై ఎన్ని పరుగుల తేడాతో గెలవాలంటే..!

  • శ్రీలంకపై న్యూజిలాండ్ గెలుపుతో పాక్, ఆఫ్ఘనిస్థాన్ సెమీస్ ఆశలపై నీళ్లు
  • 287 పరుగుల తేడా లేదా 284 బంతులు మిగిలివుండగా గెలిస్తే పాక్‌కు ఛాన్స్
  • సెమీస్ రేసు నుంచి ఆప్ఘనిస్థాన్‌ నిష్క్రమణ   లాంఛనమే
How many runs should Pakistan win against England to reach the semis

వరల్డ్ కప్ 2023 సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ చెలరేగింది. శ్రీలంకపై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపుతో మొత్తం 10 పాయింట్లు, 0.743 నెట్ రన్‌రేటుతో నాలుగవ సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. శ్రీలంకపై న్యూజిలాండ్ సాధించిన ఈ విజయం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల సెమీస్ ఆశలపై దాదాపు నీళ్లు చల్లినట్టే భావించాలి. ఎందుకంటే పాకిస్థాన్ లేదా ఆఫ్ఘనిస్థాన్ జట్లు సెమీ ఫైనల్ చేరాలంటే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అత్యద్భుత విజయం సాధించాల్సి ఉంటుంది.

సెమీస్ రేసుకు టెక్నికల్‌గా అవకాశమున్న పాకిస్థాన్.. ఇంగ్లండ్‌పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. పాక్ ముందుగా బ్యాటింగ్ చేస్తే 287 పరుగుల తేడాతో గెలవాలి. ఒకవేళ ఛేజింగ్ చేస్తే ఏకంగా 284 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించాలి. ఈ 2 సమీకరణాల్లో మాత్రమే పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశం ఉంటుంది. ఇక ఆప్ఘనిస్థాన్ సెమీ ఫైనల్ చేరే అవకాశాలు మూసుకుపోయినట్టే చెప్పాలి. ఎందుకంటే ఆ జట్టు నెట్ రన్‌రేటు -0.338గా ఉంది. దీంతో సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించింది. ఒక్క మ్యాచ్‌తో న్యూజిలాండ్ రన్ రేటును మించడం అసాధ్యం. న్యూజిలాండ్, పాకిస్థాన్‌ల కంటే ఆఫ్ఘనిస్థాన్ చాలా తక్కువగా ఉండడమే ఈ పరిస్థితి కారణమైంది.

ఇదిలావుండగా గురువారం శ్రీలంకపై న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని కివీస్ బ్యాట్స్‌మెన్ సులభంగా ఛేదించారు. దీంతో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు అందుకుంది. 10 పాయింట్లతో సెమీస్‌ చేరుకుంది. ఇక కివీస్ చేతిలో ఓటమిపాలైన శ్రీలంక ఇంటిదారి పట్టింది. టోర్నీలో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించింది. ఈ జట్టు రన్‌రేటు -1.419గా ఉంది.

More Telugu News