Revanth Reddy: తుమ్మల, పొంగులేటి ఇళ్లలో ఐటీ సోదాలు... స్పందించిన రేవంత్ రెడ్డి

  • తుమ్మల, పొంగులేటి ఇళ్లలో ఐటీ సోదాలు దేనికి సంకేతం? అని రేవంత్ రెడ్డి ప్రశ్న
  • బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదు? అన్న టీపీసీసీ చీఫ్
  • రాష్ట్రంలో కాంగ్రెస్ సునామిని ఆపే కుతంత్రమేనని విమర్శలు
Revanth Reddy responds on it searches in congress leaders houses

కాంగ్రెస్ నేతలు, ఎన్నికల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థుల ఇళ్లలో ఐటీ దాడుల అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నిన్న తుమ్మల నాగేశ్వరరావు, నేడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గురువారం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. నిన్న, నేడు తమ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదో చెప్పాలని నిలదీశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోదీ - కేడీ బెంబేలెత్తుతున్నారన్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రమే ఐటీ దాడులు అన్నారు. ఈ దాడులను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.  
నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయమన్నారు. 

నవంబర్ 10న చలో కామారెడ్డి

రేపు ఉదయం పది గంటలకు చలో కామారెడ్డి అంటూ రేవంత్ రెడ్డి మరో ట్వీట్ చేశారు. 

'కొలువులివ్వని కల్వకుంట్లను
పదవి పీకి పాతరేద్దాం
నివురు కప్పిన నిరుద్యోగి…
నిప్పు కణికై కదలిరా…
ఛలో కామారెడ్డి
నవంబర్ 10 
ఉదయం 10 గంటలకు' అని ట్వీట్ చేశారు.

More Telugu News