Telangana: ప్రధాని మోదీ ‘బీసీ ఆత్మగౌరవ సభ’లో పాల్గొనకపోవడానికి కారణం చెప్పిన రాజాసింగ్

  • సభ ఖర్చు తన ఖాతాలో పడే అవకాశం ఉండడంతో వెళ్లలేదని వెల్లడి
  • సభ నిర్వహించిన ఎల్బీ స్టేడియం తాను పోటీ చేస్తున్న గోషామహల్ పరిధిలోనే ఉందని స్పష్టత
  • వీడియో ద్వారా చర్చలకు ముగింపు పలికిన రాజాసింగ్
Rajasingh gave the reason why Prime Minister Modi did not participate in the BC self esteem meeting

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ‘బీసీ ఆత్మగౌరవ సభ’లో ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొనకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవలే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ను బీజేపీ ఎత్తివేసినా ఆయన ఎందుకు హాజరుకాలేదంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి. మోదీ సభ మాత్రమే కాదు గోషామహాల్ అసెంబ్లీ పరిధిలో పలు బీజేపీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ చర్చకు ఎమ్మెల్యే రాజా సింగ్ ముగింపు పలుకుతూ ఒక వీడియోను విడుదల చేశారు.

తాను ఆ సభలో పాల్గొంటే ఆ ఖర్చు మొత్తం తన ఖాతాలో వేసే అవకాశం ఉండడంతోనే నరేంద్ర మోదీ పాల్గొన్న ‘బీసీ ఆత్మగౌరవ సభ’కు వెళ్లలేదని రాజాసింగ్ వివరణ ఇచ్చారు. సభ నిర్వహించిన ఎల్బీ స్టేడియం తాను పోటీ చేస్తున్న గోషామహల్ నియోజకవర్గం పరిధిలోనే ఉందని, తాను ఇప్పటికే నామినేషన్ వేశానని, సభ ఖర్చు తన ఖాతాలో పడే అవకాశం ఉండడంతోనే వెనక్కి తగ్గానని చెప్పారు. కాగా నరేంద్రమోదీ, బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభను టీవీలో చూడటం తనకు బాధగా అనిపించిందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కూడా తెలియజేశానని వీడియోలో రాజాసింగ్ పేర్కొన్నారు. పార్టీ నేతలు, కేంద్ర ఎన్నికల కమిషన్‌తో మాట్లాడానని పేర్కొన్నారు.

More Telugu News