Komatireddy Venkat Reddy: నేను ముఖ్యమంత్రి అయ్యేరోజు వస్తుంది: కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

  • నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ ఎంపీ
  • ఏపీలో నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారన్న కోమటిరెడ్డి
  • పోలింగ్ చివరి రోజున రైతుబంధు వేస్తారు.. మోసపోవద్దని హెచ్చరిక
Komatireddy Venkat Reddy says he will becomc cm

ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే రోజు వస్తుందని, ఏదో ఒకరోజు తాను సీఎంను అవుతానని భువనగిరి ఎంపీ, నల్గొండ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన రోడ్డు షోలో మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ మాయమాటలు చెప్పి గత ఎన్నికల్లో విజయం సాధించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తమకు నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. కానీ తెలంగాణ ఇచ్చిన లక్ష్యం నెరవేరలేదన్నారు. రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల ఆత్మహత్యల కోసం తెలంగాణను తెచ్చుకోలేదన్నారు.

ఉద్యోగాల భర్తీలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. పోలింగ్ చివరి రోజున రైతుబంధు డబ్బులు వేస్తారని, ఎవరూ మోసపోవద్దని హితవు పలికారు. నల్గొండలో ప్రస్తుతం కనిపిస్తోన్న అభివృద్ధి తాను చేసిందే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు డెబ్బై ఏళ్లయినా చెక్కు చెదరలేదని, కానీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం బ్యారేజీ అప్పుడే బీటలు వారిందన్నారు. డిసెంబర్ 9 మన లక్కీ నెంబర్ అని, ఆ రోజు సోనియా పుట్టిన రోజు అని, ఆ రోజే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.

More Telugu News