Vijayawada: విజయవాడ బస్సు ప్రమాదం ఘటనలో ఆరోపణలు .. యాక్సిడెంట్ సీసీటీవీ ఫుటేజీ ఇదిగో!

  • సరిగా శిక్షణ ఇవ్వకుండానే డ్రైవర్ కు ఆటో ట్రాన్స్ మిషన్ బస్సు అప్పగింత
  • ఎక్స్ లేటర్ సమస్యపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలు
  • తప్పంతా డ్రైవర్ దేనని చేతులు దులుపుకునే ప్రయత్నంలో అధికారులు
vijayawada bus accident cctv futage

విజయవాడ బస్టాండ్ లో సోమవారం జరిగిన బస్సు ప్రమాద ఘటనపై డ్రైవర్లు, ఇతర సిబ్బంది సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రమాదానికి కారణమైన బస్సు తరచుగా రిపేర్లకు వస్తోందని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. అత్యాధునిక బస్సు నడిపేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వకుండానే ఆటో ట్రాన్స్ మిషన్ బస్సుపై విధులు వేస్తున్నారని చెప్పారు. కేవలం రెండు రోజుల శిక్షణ ఇచ్చి బస్సు అప్పగించారని, దీనికి తోడు బస్సులో ఎక్స్ లేటర్ సమస్య ఉండడంతో ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ చెబుతున్నాడు. ఎక్స్ లేటర్ కింద ఉండే సెన్సర్ చాలా కాలంగా పనిచేయడంలేదని, ప్లాస్టిక్ కవర్ చుట్టి బస్సును నడిపిస్తున్నారని వివరించాడు. ఆదివారం రోజు ఇలాంటి బస్సును నడిపానని, సోమవారం తనకు ఈ బస్సు అప్పగించారని చెప్పాడు.
 
డ్రైవర్లకు తగిన శిక్షణ ఇవ్వకుండా ఆటో ట్రాన్స్ మిషన్ బస్సు అప్పగించిన అధికారులు.. ప్రమాదానికి కారణం డ్రైవరేనని నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరమ్మతుల విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు చేతులు దులుపుకునే మార్గం వెతుకుతున్నట్లు డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. కాగా, బస్సు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని అధికారులు తాజాగా విడుదల చేశారు.


More Telugu News