Nara Lokesh: సొంత పార్టీ కార్యకర్తలపైనా వైసీపీ నేతల దాష్టీకం.. జగన్ పాలనలో మహిళలకు రక్షణేది?: నారా లోకేశ్

  • వాలంటీర్ పై ఎంపీటీసీ అత్యాచారయత్నం ఘటనపై లోకేశ్ మండిపాటు
  • బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని విమర్శలు
  • వాలంటీర్ వీడియోను షేర్ చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
Nara Lokesh Tweet

జగన్ పాలనలో ఆయన సొంతపార్టీ కార్యకర్తలకే రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. వైసీపీ నేతలు తమ కార్యకర్తలపైనా దాష్టీకం చూపిస్తున్నారని ఆరోపించారు. సొంత పార్టీ కార్యకర్తలనే వదలని వాళ్లు సామాన్యుల విషయంలో ఎలా వ్యవహరిస్తారో ఆలోచించనక్కర్లేదని చెప్పారు. ఈమేరకు మడకశిర నియోజకవర్గం రావూరు పంచాయతీ వలంటీర్ వేదపై అత్యాచారయత్నం ఘటనపై లోకేశ్ తాజాగా స్పందించారు. బాధితురాలి వీడియోను షేర్ చేస్తూ.. వైసీపీ ఎంపీటీసీపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు.

నిందితుడికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని, ఆయనే వెనకుండి ఇదంతా చేయిస్తున్నాడని బాధితురాలు చెబుతోందన్నారు. వారి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందన్నా పోలీసులు స్పందించడంలేదని వీడియోలో ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. జగన్ పాలనలో అధికార పార్టీ కార్యకర్తలకే రక్షణ లేకుండా పోయిందని, ఇక సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరంలేదని నారా లోకేశ్ పేర్కొన్నారు.

More Telugu News