Raja Singh: రాజాసింగ్‌కు పోలీసు నోటీసులు.. కారణం ఇదే!

  • దసరా రోజున నిషేధిత ఆయుధాలు బహిరంగంగా ప్రదర్శించడంపై నోటీసులు
  • దాండియా వేడుకలకు ముస్లింలను అనుమతించొద్దంటూ విద్వేష ప్రసంగం చేశారని షోకాజ్
  • ఇదంతా సీఎం కేసీఆర్ కుట్ర అని ఆరోపించిన రాజాసింగ్
Police notices to Rajasingh and this is the reason

గోషామహల్ బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. దసరా రోజున ఆయుధ పూజ సందర్భంగా నిషేధిత ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంతో మంగళ్‌హట్ పోలీసులు షోకాజ్ నోటీసులు పంపించారు. విద్వేష ప్రసంగానికి సంబంధించి రెండు విచారణా నోటీసులు ఆయనకు జారీ చేశారు. కాగా తుపాకులు, కత్తులు ప్రదర్శించి రాజా సింగ్ పూజలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అక్టోబర్ 16న రాజాసింగ్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోలో విద్వేషపూరిత ప్రసంగం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

నవరాత్రి దాండియా కార్యక్రమాలు, వేడుకలకు ముస్లింలను అనుమతించవద్దని నిర్వాహకులను రాజాసింగ్ కోరారు. అంతేకాదు కార్యక్రమానికి హాజరైన వారందరి గుర్తింపు కార్డులను పరిశీలించాలని, ఈవెంట్ కోసం ముస్లిం బౌన్సర్లు, వీడియోగ్రాఫర్లు, డీజే నిర్వాహకులు లేదా ఇతర వ్యక్తులను నియమించుకోవద్దని వీడియోలో కోరారు. ఈ వీడియోపై స్థానిక లీడర్ ఎంఏ సమద్ వార్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 153ఏ, 295ఏ, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు.

దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నోటీసులు జారీ చేసిందని చెబుతున్నారు. కేసీఆర్ కూడా దసరా రోజున ఆయుధ పూజ చేశారని, పోలీసులు ఆయనకు కూడా నోటీసులు జారీ చేస్తారా? అని ప్రశ్నించారు. సీఎం తనను వేధించాలని చూస్తున్నారని, ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యేలా చూడాలని భావిస్తున్నారని ఆరోపించారు.

More Telugu News