YS Sharmila: సజ్జల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన షర్మిల

  • తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని షర్మిల నిర్ణయం
  • ఆమె నిర్ణయంపై వ్యాఖ్యలు చేసిన సజ్జల
  • ముందు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని సజ్జలకు షర్మిల హితవు
Sharmila reacts to Sajjala comments

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. గతంలో తాను తెలంగాణలో కొత్త పార్టీ  స్థాపించినప్పుడు తమకేమీ సంబంధం లేదన్న సజ్జల, ఇప్పుడు తాను కాంగ్రెస్ కు మద్దతిస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నారని షర్మిల ప్రశ్నించారు. 

తనపై మాట్లాడడం కాదని, ఏపీ పరిస్థితులపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల సజ్జల స్పందించాలని హితవు పలికారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపే శక్తి కాంగ్రెస్ కే ఉందని, అందుకే ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు. 

"నేను తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజే... ఆమె పార్టీ పెడితే మాకేంటి సంబంధం అన్న వ్యక్తి సజ్జల. ఇవాళ ఆయన ఏ సంబంధం ఉందని మాట్లాడుతున్నారు? నేనయితే ఏ సంబంధం లేదనే అనుకుంటున్నాను. మరి మీరు మాట్లాడుతున్నారంటే సంబంధం కలుపుకుంటున్నారని అనుకోవాలా? దీనికి సజ్జల సమాధానం చెప్పాలి. ఓవైపు సీఎం కేసీఆర్ బహిరంగంగానే సింగిల్ రోడ్ అయితే ఆంధ్రా, డబుల్ రోడ్ అయితే తెలంగాణ... చీకటి అయితే ఆంధ్రా, వెలుగు అయితే తెలంగాణ అంటున్నారే... దీనికి సజ్జల ఏం సమాధానం చెబుతారు?" అని ప్రశ్నించారు.

More Telugu News