World cup 2023: శ్రీలంక క్రికెట్ బోర్డు మొత్తాన్ని తొలగించిన మంత్రి.. వరుస ఓటములపై సీరియస్

  • అర్జున రణతుంగ నేతృత్వంలో మధ్యంతర బోర్డు ఏర్పాటు
  • ఏడుగురు సభ్యులను ఎంపిక చేసిన మంత్రి రోషన్ రణసింఘె
  • ఇండియాపై అవమానకర రీతిలో ఓటమి నేపథ్యంలో నిర్ణయం
Sri Lanka Sack Entire Cricket Board Over World Cup Humiliation Against India

ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో తమ జట్టు ప్రదర్శనపై శ్రీలంక క్రీడా శాఖ మంత్రి రోషన్ రణసింఘె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవల భారత్ తో జరిగిన మ్యాచ్ లో అవమానకర రీతిలో ఓడిపోవడంపై సీరియస్ అయ్యారు. దిద్దుబాటు చర్యలు చేపట్టిన మంత్రి.. మొత్తం క్రికెట్ బోర్డునే తొలగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి మధ్యంతర బోర్డును ఏర్పాటు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

1996 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు నేతృత్వం వహించిన అర్జున రణతుంగను ఈ కమిటీకి చైర్మన్ గా నియమించారు. ఈ ప్యానెల్ లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, క్రికెట్ బోర్డు మాజీ ప్రెసిడెంట్ సహా ఏడుగురు సభ్యులను నియమించారు. ఇండియాతో జరిగిన మ్యాచ్ లో ఘోర వైఫల్యం తర్వాత మంత్రి రోషన్ రణసింఘె క్రికెట్ బోర్డుపై మండిపడ్డారు.

శ్రీలంక క్రికెట్ బోర్డ్ అవినీతితో నిండిపోయిందని ఆరోపించారు. బోర్డ్ ప్రెసిడెంట్ తో పాటు సభ్యులకు ఆ పదవుల్లో కొనసాగే అర్హత లేదని విమర్శించారు. వరల్డ్ కప్ టోర్నీలో జట్టు వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా బోర్డు మొత్తాన్ని తొలగిస్తూ మంత్రి రోషన్ రణసింఘె ఉత్తర్వులు జారీ చేశారు.

More Telugu News