MLC Kavitha: మహిళా రిజర్వేషన్లపై మరో పోరాటం: ఎమ్మెల్సీ కవిత

  • 2024 నుంచే అమలు చేయాలని డిమాండ్
  • భారత్ జాగృతి తరఫున న్యాయపోరాటం
  • న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు వెల్లడి
Mlc Kavitha Says Bharat Jagruthi Fights For Womens Reservation Act With Immediate Effect

మహిళా రిజర్వేషన్లపై మరో పోరాటం చేస్తామని తెలంగాణ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తాము చేసిన పోరాటానికి దిగి వచ్చిన కేంద్రం.. పార్లమెంట్ లో బిల్లును పాస్ చేసిందని చెప్పారు. చట్టంగా మారిన తర్వాత అమలు వాయిదా వేసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. దీంతో మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2024 నుంచే అమలు చేయాలనే డిమాండ్ తో మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు కవిత వివరించారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే తాము కూడా న్యాయపోరాటం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ విషయంపై న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై పలు పార్టీలు, సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయని చెప్పారు. ఆయా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోందని గుర్తుచేశారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్ లో భారత్ జాగృతి తరఫున తాము ఇంప్లీడ్ అవుతామని వివరించారు.

More Telugu News