World Cup: జంపా మ్యాజిక్... వరల్డ్ కప్ నుంచి ఇంగ్లండ్ అవుట్

  • వరల్డ్ కప్ లో ఆసీస్ వర్సెస్ ఇంగ్లండ్
  • 33 పరుగుల తేడాతో నెగ్గిన ఆసీస్
  • కంగారూల సెమీస్ చాన్సులు మరింత మెరుగు
  • ఆరో ఓటమితో టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించిన ఇంగ్లండ్
England out of world cup after lose to Australia

వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ కథ మారలేదు. ఆ జట్టు ఖాతాలో మరో పరాజయం చేరింది. ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ చేజేతులా ఓడింది. ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా మ్యాజిక్ స్పెల్ తో ఇంగ్లండ్ ను దెబ్బతీశాడు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 

ఈ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో బెన్ స్టోక్స్ 64 పరుగులు చేయగా, ఓపెనర్ డేవిడ్ మలాన్ 50, మొయిన్ అలీ 42 పరుగులు చేశారు. 

ఓ దశలో ఇంగ్లండ్ గెలుపు బాటలో పయనిస్తున్నట్టే కనిపించింది. అయితే జంపా బంతిని అందుకున్నాక పరిస్థితి మారిపోయింది. తొలుత ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (1) వికెట్ తీసిన జంపా... ఆ తర్వాత క్రీజులో పాతుకుపోయిన స్టోక్స్, మొయిన్ అలీలను కూడా పెవిలియన్ కు తిప్పిపంపాడు. దాంతో ఇంగ్లండ్ ఓటమి బాటలోకి మళ్లింది. 

చివర్లో క్రిస్ వోక్స్ (32), అదిల్ రషీద్ (20) పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. వోక్స్ ను స్టొయినిస్ అవుట్ చేయగా, హేజెల్ వుడ్ బౌలింగ్ లో అదిల్ రషీద్ అవుటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో జంపా 3, స్టార్క్ 2, హేజెల్ వుడ్ 2, పాట్ కమిన్స్ 2, స్టొయినిస్ 1 వికెట్ తీశారు. 

ఈ విజయంతో ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలు మరింత మెరుగుపర్చుకుంది. ఆసీస్ తదుపరి మ్యాచ్ లలో ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లతో ఆడాలి. వీటిలో ఒక్క మ్యాచ్ లో గెలిచినా ఆసీస్ కు సెమీస్ బెర్తు లభించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆసీస్ 7 మ్యాచ్ లు ఆడి 5 విజయాలతో 10 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో ఆసీస్... టీమిండియా, దక్షిణాఫ్రికా తర్వాత మూడో స్థానంలో ఉంది.

అటు, ఇంగ్లండ్ ఆరో ఓటమితో టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. డిఫెండింగ్ చాంపియన్ గా ఈ టోర్నీలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ ఇంత దారుణంగా ఆడుతుందని వరల్డ్ కప్ కు ముందు ఎవరూ అనుకుని ఉండరు. కానీ, భారత పిచ్ లపై చిన్న జట్లు రాణించిన చోట, ఇంగ్లండ్ ఘోర పరాజయాలు చవిచూసింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటిదాకా 7 మ్యాచ్ లు ఆడిన ఇంగ్లండ్ కేవలం ఒక మ్యాచ్ లోనే గెలిచి పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలిచింది. 

ఇంగ్లండ్ ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా, ఆ రెండు మ్యాచ్ ల్లో గెలిస్తేనే 2025 చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తుంది.

More Telugu News