Somnath: వివాదం నేపథ్యంలో పుస్తకావిష్కరణ వాయిదా వేసుకున్న ఇస్రో ఛీఫ్

  • జీవితచరిత్ర రాసిన ఇస్రో చైర్మన్ సోమనాథ్
  • ఇస్రో మాజీ చైర్మన్ శివన్ పై పుస్తకంలో ఆరోపణలు చేసినట్టు ప్రచారం
  • విమర్శలను ఖండించిన సోమనాథ్
  • శివన్ పై ఎక్కడా ఆరోపణలు చేయలేదని స్పష్టీకరణ
ISRO Chief Somnath postpones book release

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవల సాధిస్తున్న విజయాలతో ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ పేరు మార్మోగుతోంది. అయితే, ఆయన రాసిన ఓ పుస్తకం వివాదంలో చిక్కుకుంది. ఆ పుస్తకం పేరు 'నిలవు కుడిచ్చ సింహంగళ్'... ఇది మలయాళ పుస్తకం. ఆ పేరుకు అర్థం 'వెన్నెలను తాగిన సింహాలు'. 

సోమనాథ్ తన పుస్తకంలో ఇస్రో మాజీ చీఫ్ కె.శివన్ పై కొన్ని విమర్శలు చేశారంటూ తాజాగా వివాదం తలెత్తింది. తాను ఇస్రో చైర్మన్ పదవిని చేపట్టకుండా అడ్డుకునేందుకు శివన్ ప్రయత్నించారని సోమనాథ్ తన పుస్తకంలో ఆరోపించినట్టు తెరపైకి వచ్చింది. దీనిపై సోమనాథ్ స్పందించారు. 

తాను పుస్తకంలో పేర్కొన్న అంశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని, శివన్ తన ఎదుగుదలను అడ్డుకున్నట్టు తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. సాధారణంగా స్పేస్ కమిషన్ లో సభ్యుడిగా ఎంపికైతే ఇస్రో చైర్మన్ పదవి ఖాయమని ఓ అభిప్రాయం ఉందని, కానీ, ఇస్రో నుంచి మరో డైరెక్టర్ ను నియమించడంతో తనకు అవకాశాలు తగ్గిపోయాయని మాత్రమే తాను పుస్తకంలో పేర్కొన్నానని సోమనాథ్ వివరణ ఇచ్చారు. ఈ వివాదం కారణంగా తన పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు సోమనాథ్ తెలిపారు. 

ఈ పుస్తకం ఇంకా విడుదల కాలేదని, ప్రచురణకర్త అభిప్రాయ సేకరణ కోసం కొన్ని కాపీలను విడుదల చేసి ఉండొచ్చని వివరించారు. అందుకే పుస్తకావిష్కరణను నిలిపివేద్దామని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. అసలు ఈ పుస్తకాన్ని తాను రాయడానికి కారణం యువతను ఉత్తేజపరిచేందుకేనని స్పష్టం చేశారు.

More Telugu News