Tamilnadu: ఆంటీ అన్నాడని కండక్టర్ పై కేసు పెట్టిన 57 ఏళ్ల మహిళ.. తమిళనాడులో ఘటన

  • భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు
  • కేసు నమోదు చేసుకున్న రెడ్ హిల్స్ పోలీసులు
  • విచారించి చర్యలు తీసుకుంటామని వెల్లడి
Police case filed on chennai bus conductor for calling a woman as aunt

ఆంటీ అని పిలిచి తనను అవమానించాడంటూ బస్ కండక్టర్ పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. చెన్నైలోని రెడ్ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. చెన్నైలోని వాషర్ మెన్ పేటకు చెందిన నిర్మలాదేవి (57) బుధవారం మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ బస్సులో ప్రయాణించింది. కండక్టర్ ఆమె వద్దకు వచ్చి.. టికెట్ ఎక్కడికి ఇవ్వాలి ఆంటీ అని అడిగాడు. దీంతో నిర్మలాదేవి మండిపడ్డారు. తనను ఆంటీ అని అంటావేంటని నిలదీశారు. అయినా ఆ కండక్టర్ వెనక్కి తగ్గలేదు.

మరోమారు ఆంటీ అనడంతో నిర్మలాదేవి అభ్యంతరం చెప్పారు. దీనిపై కండక్టర్ తో వాదనకు దిగారు. కండక్టర్ వినిపించుకోకపోవడంతో తన భర్తకు ఫోన్ చేసి రెడ్ హిల్స్ కు పిలిపించుకున్నారు. బస్సు దిగాక భర్తతో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కండక్టర్ పై ఫిర్యాదు చేశారు. బస్సు, కండక్టర్ పేరు వివరాలు చెప్పి.. తనను ఆంటీ అని పిలిచి అవమానించాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్మలాదేవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, పోలీసులు విచారణ చేపట్టారు.

More Telugu News