Team India: సిరాజ్, షమీలకు పూనకాలు... 22 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన శ్రీలంక

  • ముంబయి వాంఖెడే స్టేడియంలో లంక విలవిల
  • నిప్పులు చెరిగే బంతులతో విజృంభించిన సిరాజ్, షమీ
  • చెరో మూడు వికెట్లతో సత్తాచాటిన పేసర్లు
  • ఏడుగురిలో ఐదుగురు డకౌట్
Siraj and Shami fires on Sri Lanka with new ball

ఇటీవల జరిగిన ఆసియా కప్ ఫైనల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (6/21) బంతితో నిప్పులు చెరిగిన ఆ మ్యాచ్ లో శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. ఇప్పుడదే సీన్ రిపీటయ్యేలా ఉంది. ఇవాళ టీమిండియా, శ్రీలంక జట్లు ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో తలపడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. 

భారత్ భారీ స్కోరు సాధించిన అదే పిచ్ పై శ్రీలంక టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. సిరాజ్ మరోసారి చెలరేగి 3 వికెట్లతో లంక పనిబట్టాడు.  ఇన్నింగ్స్ తొలి బంతికే లంక ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక (0)ను డకౌట్ చేయడం ద్వారా బుమ్రా లంక వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత సిరాజ్ మ్యాజిక్ మొదలైంది. మరో ఓపెనర్ కరుణరత్నే (0)ను ఖాతా తెరిచే చాన్స్ ఇవ్వకుండా పెవిలియన్ కు పంపిన సిరాజ్, అదే ఊపులో లంక కెప్టెన్ కుశాల్ మెండిస్ (1) ను కూడా అవుట్ చేశాడు. అతడ్ని సిరాజ్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత సదీర సమరవిక్రమకు సిరాజ్ ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు. సమరవిక్రమను కూడా డకౌట్ చేశాడు. అప్పటికి లంక స్కోరు 3 పరుగులే. 

ఆ తర్వాత మహ్మద్ షమీ బంతిని అందుకోవడం లంక మరింత హడలిపోయింది. షమీ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి లంకను కోలుకోలేని దెబ్బకొట్టాడు. అప్పటికి స్కోరు 9.4 ఓవర్లలో 14 పరుగులకు 6 వికెట్లు. షమీ ధాటికి చరిత్ అసలంక (1), దుషాన్ హేమంత (0) పేలవ రీతిలో వెనుదిరిగారు. కాసేపటికే దుష్మంత చమీర కూడా షమీ బంతికి బలయ్యాడు. వికెట్ల వెనుకాల కేఎల్ రాహుల్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో షమీకి మూడో వికెట్ దక్కింది. 

ప్రస్తుతం లంక స్కోరు 11.2 ఓవర్లలో 7 వికెట్లకు 22 పరుగులు. సీనియర్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (11 బ్యాటింగ్), తీక్షణ (0 బ్యాటింగ్) ఉన్నారు.

More Telugu News