Payyavula Keshav: ఆ అద్భుతానికి నేను ప్రత్యక్ష సాక్షిని... సజ్జలకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది: పయ్యావుల

  • చంద్రబాబు రాజమండ్రి నుంచి ఉండవల్లి చేరుకునేందుకు 14 గంటలు
  • చంద్రబాబు కోసం పోటెత్తిన పార్టీ శ్రేణులు
  • చంద్రబాబు కోర్టు నిబంధనలు ఉల్లంఘించారంటున్న వైసీపీ నేతలు
  • ప్రెస్ మీట్ పెట్టి సజ్జలకు కౌంటర్ ఇచ్చిన పయ్యావుల
Payyavula counters Sajjala and YCP leaders remarks

టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలై రోడ్డు మార్గంలో ఉండవల్లి చేరుకునే సరికి 14 గంటల సమయం పట్టింది. దారిపొడవునా, అడుగడుగునా ఆయనకు జననీరాజనం లభించిందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు రాకకోసం ఎదురుచూస్తే ప్రజలు రోడ్ల పక్కన పడుకున్న దృశ్యాలు కూడా కనిపించాయి. అయితే, జైలు నుంచి విడుదలయ్యాక చంద్రబాబు కోర్టు నిబంధనలు ఉల్లంఘించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ధ్వజమెత్తారు. "రెండు గంటల ప్రయాణానికి 14 గంటలు ఎందుకు పట్టిందని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. చంద్రబాబు ప్రయాణానికి 14 గంటలు ఎందుకు పట్టిందో, ఆ 14 గంటలు రోడ్డుపై ఏం జరిగిందో ఈపాటికి మీ నిఘా వర్గాలు చెప్పి ఉండాలి కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారూ! అవి విన్నాక గుండె గుభేల్మమనే పరిస్థితులు ఉంటాయి కదా! 

ఇంకా విశ్వాసం, నమ్మకం వంటివి సన్నగిల్లి ఉంటాయి కదా ఈపాటికి! ఏం జరిగింది, జన సునామీ ఎలా వచ్చింది, ప్రజాభిమానం ఎలా కట్టలు తెంచుకుని రోడ్లపైకి వచ్చిన విషయం తెలిసుంటుంది కదా! కళ్ల ముందు కనిపించి ఉంటుంది కదా...!

మధ్యాహ్నమో, సాయంత్రమో కాదు... అర్ధరాత్రి, తెల్లవారుజామున... ఇలా ఏ సమయంలో చూసినా వేల మంది జనం, అడుగడుగునా జనం... అన్ని వయసుల వారు, 10 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు వారు... పిల్లల నుంచి వృద్ధుల వరకు, మహిళలు, రైతులు, కార్మికులు, అన్ని వర్గాల వారు పోటెత్తారు. ఈపాటికి మీకు నిఘా వర్గాల వారు సగానికి సగం తగ్గించి చెప్పినా, మీరు సగమే చూడాలనుకున్నా, అందులో పావు వంతు చాలు మీ గుండెలు జారడానికి! 

ప్రజాభిమానం కట్టలు తెంచుకుంటే ఎలా ఉంటుందో చూడడం నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇదే మొదటిసారి. ఆ 14 గంటల ప్రయాణంలో నేను కళ్లారా చూశాను. అడుగడుగునా నిరాజనాలు పలికారు... ఉన్నారు కదా మీ పోలీసులు, వాళ్లు చెప్పుంటారు కదా! ఎక్కడన్నా మా వాహనం ఒక్క నిమిషం ఆపామా? మీటింగులు చెప్పారా? చంద్రబాబునాయుడు కారు దిగాడా?... లేదే! 

వాహనం ముందుకు సాగలేనంత జనం! జనం అడుగడుగునా అడ్డుపడ్డారు. గంటకు 20 కిమీ వేగంతో కూడా వెళ్లలేని పరిస్థితి! ఇదంతా నేను ప్రత్యక్షంగా చూశాను. చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇంతటి ప్రజాభిమానం ఎందుకు వెల్లువెత్తిందో తెలుసా... చంద్రబాబుపై నమ్మకం... ఈ తప్పు ఆయన చెయ్యలేదు అని నమ్మకం... మా కోసం పనిచేసిన వ్యక్తి అని నమ్మకం... ఈయన ద్వారా మేం లబ్ది పొందాము అన్న నమ్మకం... చంద్రబాబు పట్ల కృతజ్ఞత ప్రదర్శిస్తూ, చంద్రబాబు కోసం నేనున్నాను అంటూ ఎవరికివారే రోడ్డెక్కిన పరిస్థితి! 

మన రాష్ట్రంలో, మన దేశంలోనే కాదు, 70 దేశాల్లో చంద్రబాబుకు మద్దతు కార్యక్రమం కొనసాగింది. ఏ రాజకీయ పార్టీ అయినా 14 గంటల పాటు ఓ కార్యక్రమాన్ని నిర్వహించగలదా? ప్రజలు రోడ్లపై పడుకుని, చంద్రబాబు వాహనం రాగానే పరిగెత్తుకుని వెళ్లి అభిమానం కురిపించిన సంఘటనలు చూశామా? 

ఈ సందర్భంగా టీడీపీ తరఫున వారందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నిజంగా ఇది ఒక అద్భుతం. ఇన్నాళ్లు ఇంతటి అభిమానం ఏమైంది అని అంటే... వాళ్ల గుండెల్లో గూడుకట్టుకున్న అభిమానం మీరు చేసిన అరాచకంతో బయటికి వచ్చింది. అన్యాయంగా ఆయనను జైల్లో పెట్టారన్న ఆవేదన, ఆక్రోశంతోటి జనం రోడ్డెక్కిన పరిస్థితి వచ్చింది" అంటూ పయ్యావుల వివరించారు.

More Telugu News