Cricket: సెమీస్ రేసులో మరింత మెరుగైన పాకిస్థాన్ అవకాశాలు.. దక్షిణాఫ్రికా చేతిలో న్యూజిలాండ్ ఓటమితో ఏం జరిగిందంటే..

  • తాజా ఓటమితో నాలుగవ స్థానానికి పడిపోయిన కివీస్
  • పాకిస్థాన్‌కు కొద్దిగా సానుకూలంగా మారిన మ్యాచ్ ఫలితం
  • రానున్న మ్యాచ్‌ల్లో పాక్ గెలిచి.. ఇతర జట్ల ఫలితాలు సానుకూలమైతే సెమీస్ అవకాశాలు!
Pakistans chances are better in the semis race in world cup 2023

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో సెమీస్ రేసు నుంచి పాకిస్థాన్ ఇక నిష్ర్కమించినట్టేనని భావించిన తరుణంలో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. బాబర్ ఆజమ్ నేతృత్వంలోని ఆ జట్టుకు పరిస్థితులు కొద్దిగా సానుకూలంగా మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. బుధవారం రాత్రి దక్షిణాఫ్రికా చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవడం పాక్‌కు సానుకూలంగా మారింది. ఆ జట్టు సెమీస్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి.

దక్షిణాఫ్రికా చేతిలో 190 పరుగుల భారీ ఓటమిని చవిచూసిన న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానానికి పడిపోయింది. 
ప్రస్తుతం పాయింట్ల టేబుల్‌లో దక్షిణాఫ్రికా, భారత్‌ చెరో 12 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియా 3వ స్థానంలో(8 పాయింట్లు, రన్‌రేట్ 0.970) ఉండగా న్యూజిలాండ్ 8 పాయింట్లు, 0.484 రన్‌రేట్‌తో నాలుగవ స్థానంలో నిలిచింది. కాగా 6 పాయింట్లతో (-0.024 రన్‌రేట్) పాకిస్థాన్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్థాన్ 6వ స్థానంలో (6 పాయింట్లు,-0.718 రన్‌రేట్) ఉంది. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో తన తర్వాత స్థానాల్లో ఉన్న జట్ల కంటే కేవలం 2 పాయింట్లు మాత్రమే ఎక్కువ కలిగివుంది. కాబట్టి ఆ జట్టుకు పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో పాకిస్థాన్ అవకాశాలు మెరుగయ్యాయి.

పాకిస్థాన్ తన తర్వాతి రెండు మ్యాచ్‌లు న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లపై ఆడనుంది. ఈ రెండు మ్యాచుల్లో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటే టాప్-4లో అడుగుపెట్టే అవకాశం లేకపోలేదు. టెక్నికల్‌గా చూస్తే ఆఫ్ఘనిస్థాన్, 7వ స్థానంలో ఉన్న శ్రీలంకలకు కూడా ఇంకా సెమీస్ అవకాశాలు మిగిలే ఉన్నాయి. మరి సెమీస్‌కు చేరుకునే జట్లు ఏవో, మరికొన్ని మ్యాచ్‌లు జరిగితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

More Telugu News