కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు: కేసీఆర్

  • మంగళవారం పలువురు పార్టీలో చేరిన సందర్భంగా కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
  • దేవుడి దయవల్ల కొత్త ప్రభాకర్ రెడ్డి బతికి బయటపడ్డారన్న కేసీఆర్
  • హత్యా రాజకీయాలను సహించేది లేదని హెచ్చరిక
మెదక్ లోక్ సభ సభ్యుడు, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం పలువురు నేతలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ పార్టీ ఎంపీని చంపాలని చూశారని, అయినప్పటికీ దేవుడి దయవల్ల ఆయన బతికి బయటపడ్డారన్నారు. ఇలాంటి హత్యా రాజకీయాలను సహించేది లేదన్నారు.

హింసాత్మక ఘటనలకు ఎవరు పాల్పడినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్ష శక్తులు ఎన్నో ఉంటాయని, హేయమైన దాడులకు తగిన బుద్ధి చెబుతామన్నారు. తెలంగాణ అధ్భుత ప్రగతి సాధించిందన్నారు. ప్రతిపక్షాలు దాడులకు పాల్పడుతూ హింసను ప్రేరేపిస్తున్నాయని, మరోసారి బీఆర్ఎస్‌ను గెలిపించి ఇలాంటి శక్తులకు బుద్ధి చెప్పాలన్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డిలు ఈ రోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వీరిద్దరికి కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ పైవ్యాఖ్యలు చేశారు.


More Telugu News

kotha prabhakar reddy KCR Telangana Assembly Election BRS