nagam janardhan reddy: బీఆర్ఎస్ లో చేరిన నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి

  • ఇద్దరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం కేసీఆర్
  • నాగం జనార్దన్ రెడ్డి1969 ఉద్యమం సమయంలో జైలుకెళ్లాడని గుర్తు చేసుకున్న కేసీఆర్
  • తన మిత్రుడు పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ చేరడం తనకు ఆనందంగా ఉందని వ్యాఖ్య
  • నాగం, విష్ణువర్ధన్ రెడ్డిల భవిష్యత్తు తనదేనన్న కేసీఆర్
Nagam and Vishnuvardhan joins BRS

మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు. వారికి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగం, విష్ణువర్ధన్ రెడ్డిలు తమ అనుచరులతో కలిసి అధికార పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... తన మిత్రుడు నాగం, యువనేత విష్ణువర్ధన్‌లకు మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నానన్నారు. నాగం జనార్దన్ రెడ్డి 1969లో తెలంగాణ ఉద్యమం సమయంలో జైలుకు వెళ్లారని గుర్తు చేసుకున్నారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించగా ఆయన అంగీకరించారన్నారు.

తెలంగాణ, హైదరాబాద్‌లోని సామాన్య ప్రజల కోసం పోరాడిన నాయకుడు పి. జనార్దన్ రెడ్డి అన్నారు. పీజేఆర్ వ్యక్తిగతంగా తనకు మిత్రుడని చెప్పారు. అలాంటి పీజేఆర్ తనయుడు బీఆర్ఎస్‌లోకి రావడం ఆనందంగా ఉందన్నారు. పార్టీలో చేరిన నాగం, విష్ణువర్ధన్ రెడ్డిల భవిష్యత్తు... బాధ్యత తనదేనని కేసీఆర్ హామీ ఇచ్చారు.

More Telugu News