Dhulipala Narendra Kumar: చంద్రబాబుపై మళ్లీ కుట్రలు జరుగుతున్నాయి: ధూళిపాళ్ల

  • స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు
  • టీడీపీ వర్గాల్లో హర్షాతిరేకాలు
  • పార్టీలోని ప్రతి ఒక్కరూ సంతోషిస్తున్నారన్న ధూళిపాళ్ల
  • చంద్రబాబుపై తాజాగా మరో అక్రమ కేసు పెట్టారని ఆగ్రహం
Dhulipalla Narendra Kumar responds on Chandrababu bail

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ లభించడం తెలిసిందే. దీనిపై టీడీపీ వర్గాల్లో ఆనందం అంబరాన్నంటుతోంది. పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఈ పరిణామంపై హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ రావడం పార్టీలోని ప్రతి ఒక్కరికీ సంతోషకరమైన అంశం అని వెల్లడించారు. 

చంద్రబాబు ప్రజల కోసం, రాష్ట్రం కోసం, ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పనిచేశారని, కానీ ఎన్నికలు వస్తుండడంతో ఆయనపై ఒకదాని తర్వాత ఒకటి అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై మళ్లీ కుట్రలు జరుగుతున్నాయని, తాజాగా మద్యం అంశంలో ఏదో జరిగిందంటూ మరో కేసు పెట్టారని ధూళిపాళ్ల వివరించారు. 

ఓ కార్పొరేషన్ ఎండీ ప్రభుత్వ విధానాలపై ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ఇలాంటిది చరిత్రలో ఎక్కడా లేదని అన్నారు. ఓ కమిషనర్ కింద పనిచేసే కార్పొరేషన్ ఎండీ ఎక్సైజ్ పాలసీలపై ఫిర్యాదు చేస్తుండడం చూస్తుంటే, ఇది కావాలని పెట్టిన కేసు అని అర్థమవుతోందని స్పష్టం చేశారు. 

చంద్రబాబు హయాంలో చేపట్టిన పథకాల్లో కానీ, పాలనా పరమైన నిర్ణయాల్లో కానీ ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని ధూళిపాళ్ల పేర్కొన్నారు.

More Telugu News